భువనేశ్వర్: జాతీయ ఓపెన్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ సాధించిన తొమ్మిదేళ్ల సాత్విక్ స్వంయిను రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి శనివారం అభినందించారు. ఇంత చిన్న వయస్సులో అతని కృషి, పదునైన తెలివితేటలు మరియు మానసిక స్థిరత్వం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. నిరంతర ప్రోత్సాహం మరియు నిరంతర మద్దతుతో సాత్విక్ విజయానికి మార్గం సుగమం చేసిన అతని తల్లిదండ్రులు మరియు కోచ్లకు ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
మాజీ సీఎం నవీన్ కోసం పూజలు
పర్లాకిమిడి: రాష్ట్ర విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శస్త్ర చికిత్స కోసం నిన్న ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో తమ ప్రియతమ నేత నవీన్ పట్నాయక్ ఆయురారోగ్యాలతో తిరిగి రాష్ట్రానికి తిరిగిరావాలని కోరుతూ పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా బీజేడీ అధ్యక్షుడు ప్రదీప్ నాయక్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, పురపాలక చైర్పర్సన్ నిర్మల శెఠి తదితరులు స్థానిక జగన్నాథ స్వామి, గ్రామదేవత నీలమణి అమ్మవారికి శనివారం పూజలు చేశారు. అలాగే స్థానిక బాప్టిస్టు చర్చిల్లో ప్రార్థనలు చేశారు.
ఓంఫెడ్ పాల ధరలు పెంపు
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్ర సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (ఓంఫెడ్) పాల ధరలను పెంచింది. ఈ పెంపు శనివారం నుంచి అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. ఒక లీటరు పాల ధర రూ.2ల నుంచి రూ.4లు వరకు పెరిగింది. మునుపటి ధర కంటే రూ.2లు పెంచడంతో టోన్డ్ పాలు ఇప్పుడు లీటరుకు రూ.50లు, ప్రీమియం పాలు లీటరుకు రూ.54లు అవుతుంది. రూ.4 పెరుగుదలతో గోల్డ్ ప్రీమియం పాలు లీటరుకు రూ.56లు, గోల్డ్ ప్రీమియం+ పాలు ఇప్పుడు లీటరుకు రూ.60లకి లభిస్తాయి.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం ఉదయం ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్లు హెచ్సీ ఎం.సోమేశ్వరరావు తెలిపారు. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. మృతుడు తెలుపు, నలుపు గీతల షర్టు, నల్లని నిక్కరు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలకు 9110305494 నంబర్ను సంప్రదించాలని కోరారు.
యువకుడు ఆత్మహత్య
కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు సూదికొండ ప్రాంతంలో సూర్యకాలనీకి చెందిన కొవిరి నూకరాజు (22) అనే యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడి కార్మికుడు నారాయణరావు రెండో కుమారుడు నూకరాజు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శభాష్ సాత్విక్
శభాష్ సాత్విక్
శభాష్ సాత్విక్