
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఆందోళన
కొరాపుట్: తమ ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని కోట్పాడ్ సమితి బబయా పంచాయతీకి చెందిన రైతులు ఆరోపించారు. ఈ మేరకు శనివారం జయపూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం మందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు (మండీ) ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ మండీలో 46 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నా, ఇప్పటివరకు కేవలం 24 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. మిగతా 20 వేల క్వింటాళ్ల ధాన్యం మండీల్లో పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని కొనుగోలు చేయాల్సిన అధికారులు మండీలకు రాకుండా ముఖం చాటేస్తున్నారని వాపోయారు. మరో 10 రోజుల్లో మండీలు ముగుస్తాయని వాపోయారు. అసలు బబయా మండికి అధికారులు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఈనెల 24వ తేదీలోపు తమ ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. లేకపోతే అదేరోజు జయపూర్ ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఆందోళన