
నేటి నుంచే సంప్రదాయ వస్త్రధారణ అమలు
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈఓ కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆదేశాల మేరకు సంప్రదాయ వస్త్రధారణ నిబంధనలు ఆదివారం నుంచే అమల్లోకి రానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం జరిగే సూర్యనమస్కార పూజల్లో పురుషులు కచ్చితంగా పంచె, చొక్కా, మహిళలు చీర చూడీదార్ను మాత్రమే ధరించి పూజల్లో కూర్చునేలా చర్యలు చేపట్టనున్నారు. ఎలాంటి ఫ్యాషన్ దుస్తులతో దర్శనాలకు అనుమతించకుండా ఈవో ప్రసాద్ ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించినట్లుగా తెలిసింది. నేటి నుంచి అంతరాలయ దర్శనాలను సాయంత్రం 6 గంటల వరకు పొడిగింపు నిర్ణయాన్ని కూడా అమలు చేయనున్నారు..దీంతో భక్తులకు మరింత సౌకర్యవంతంగా అంతరాలయ దర్శనానికి వీలవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఆటోడ్రైవర్ అనుమానాస్పద మృతి
ఎచ్చెర్ల : లావేరు మండలం అదపాక సమీపంలోని పంట పొలాల్లో విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పి.జగన్నాథం(35) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అదపాక వీఆర్వో ఎన్.వెంకటరమణ ఫిర్యాదు మేరుకు లావేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. లావేరు హెచ్సీ జోగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.