
బంధాలు బలమైనవి
ఒడిశా, పశ్చిమ బెంగాల్..
భువనేశ్వర్: తరతరాలుగా ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక, భాషా మరియు సాంప్రదాయ బంధాలు అత్యంత బలమైనవని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. స్థానిక రాజ్ భవన్ నూతన అభిషేక్ హాల్లో శనివారం జరిగిన పశ్చిమ బెంగాల్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన ఈ విషయం తెలిపారు. ఏక్ భారత్ – శ్రేష్ట భారత్ చొరవలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పురాతన నాగరికత నుంచి ఆధునిక డిజిటల్ యుగం వరకు భారతదేశం పరివర్తన, పురోగతికి కేంద్రంగా పశ్చిమ బెంగాల్ను గవర్నర్ అభివర్ణించారు. ఈ రాష్ట్రానికి చెందిన సాధువు శ్రీచైతన్య, రాజా రామ్మోహన్రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద, నోబెల్ గ్రహిత రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ థెరెస్సా వంటి వారు దేశానికి మార్గదర్శకులుగా నిలిచారన్నారు. ఒడిశాలో నివసిస్తున్న బెంగాలీ సమాజాన్ని ఆయన ప్రశంసించారు. చాలా మంది రాష్ట్రాన్ని తమ రెండో నివాసంగా మార్చుకున్నారన్నారు. ఐక్యత మరియు పరస్పర అవగాహనను పెంపొందించడానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ స్థానికులు ఒడిశాలో నివసించిన వారి అనుభవాలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.

బంధాలు బలమైనవి