
ఫ్యామిలీ కోర్టు ప్రారంభం
కొరాపుట్: జిల్లాలోని కోట్పాడ్ పట్టణంలో ఫ్యామిలీ కోర్టు సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. జయపూర్ కుటుంబ న్యాయస్థానం జడ్జి నిషిత్ నిశాంక్ కోట్పాడ్ కోర్టులో సర్క్యూట్ ఫ్యామిలీ కోర్టు సేవలు ప్రారంభించారు. ప్రతీ నెలకు రెండుసార్లు కేసులు విచారించనున్నారు. దీంతో ఇకపై కోట్పాడ్ ప్రాంతానికి చెందిన కక్షిదారులు జయపూర్ వెళ్లాల్సిన అవసరం ఉండదు. కోర్టుకి వచ్చిన జడ్జిని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మణి పట్నాయక్, మాజీ అధ్యక్షుడు పంకజ్ పాత్రో స్వాగతం పలికారు.
పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్
జయపురం: సబ్ డివిజన్ కోట్పాడ్లో గత మూడేళ్లుగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు పనిచేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూడేళ్ల క్రితం పురపాలక సంస్థ కోట్పాడ్ గాంధీ జంక్షన్ వద్ద, బిజూ పట్నాయిక్ జంక్షన్ వద్ద సిగ్నల్ పాయింట్లు ఏర్పాటు చేసింది. అయితే ఆ రెండు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు అప్పటినుంచి పనిచేయడం లేదని వెల్లడించారు. అవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని వాపోతున్నారు. ఈ రెండు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను బాగు చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా వీటిని మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు
కొరాపుట్: జయపూర్లో నూతనంగా ప్రారంభించనున్న కేంద్రీయ విద్యాయలంలో లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు జరిగింది. శనివారం బాయ్స్ హైస్కూల్ సమీపంలోని విద్యాలయం ఆవరణలో జయపూర్ సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి పర్యవేక్షణలో లాటరీ తీశారు. జూలై నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభమవ్వనున్నాయి. ఒకటి నుండి 5 తరగతులకు 1,009 మంది అప్లికేషన్లు ఇచ్చారు. ఒక్కొక్క తరగతికి 40 సీట్లు ఉన్నాయి. దీంతో సీట్ల కేటాయింపులో అవకతవకలు చోటుచేసుకోకూడదని అందరి ముందు లాటరీ తీశారు. కార్యక్రమంలో విద్యాలయం ప్రిన్సిపాల్ హరిహర పండా, కొరాపుట్ కేవీ ప్రిన్స్పాల్ సరోజ్ కుమార్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సెలవులు రద్దు
భువనేశ్వర్: సువర్ణ రేఖ నది ఉప్పొంగడంతో వరద పరిస్థితి నెలకొని ఉంది. ఉధృతి క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో విపత్కర పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బాలాసోర్ జిల్లా యంత్రాంగం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. సెలవులో ఉన్న ఉద్యోగులు వెంటనే విధులకు హాజరు కావాలని కలెక్టర్ సూర్యవంశీ మయూర్ వికాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా తమ ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లరాదని ఆదేశించారు. బాలాసోర్ జిల్లా జలేశ్వర్ మండలం రాజ్ఘాట్ సమీపంలో సువర్ణ రేఖ నది ప్రమాద సంకేతం దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా అనేక లోతట్టు గ్రామాల్లో వరద పరిస్థితులు తాండవిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో భొగరాయ్ మరియు బలియాపాల్ మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వరద నీరు ఖొల్లాబాడియా, కుల్హా, బౌంసఖానా, కుదమాన్సింగ్, చౌదరికుద్, బలియాపాల్ వంటి గ్రామాలను ముంచెత్తింది. కొన్ని రోడ్లపై నాలుగు అడుగుల ఎత్తు వరకు వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జల దిగ్భందంలో చిక్కుకున్న ప్రాంతాలు ఒంటరిగా బిక్కుబిక్కుమంటున్నాయి. భోగరై, జలేశ్వర్, బలియాపాల్ మండలాల్లోని పలు పంచాయతీలు వరద ఉన్నాయి.

ఫ్యామిలీ కోర్టు ప్రారంభం