
రబీ ధాన్యం కొనుగోలుకు సమయం పెంచాలి
జయపురం: కొరాపుట్ జిల్లా రైతుల నుంచి రబీ ధాన్యం కొనుగోలు చేయాలని జయపురం సబ్ డివిజన్ కొట్పాడ్ కృషక మోర్చా, కొట్పాడ్ రబీ మండీ కమిటీలు ప్రతినిధులు సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. గురువారం కొట్పాడ్ కృషక మోర్చా అధ్యక్షుడు సీతానాథ్ బిశ్వాల్, కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో పలువురు రైతులు జయపురం సబ్కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అందులో జూన్ 2 నుంచి మండీలలో రబీ ధాన్యం కొనుగులు చేస్తామని ప్రకటించిన అధికారులు.. రైతులకు టోకెన్లు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కొట్పాడ్లో 10వ తేదీన మండీలు ప్రారంభించారని, గత 8 దినాలలో రైతుల నుంచి ధాన్యం కొనలేదని ఆరోపించారు. ధాన్యం కొనేందుకు కలహండి, బలంగీర్ మిల్లర్లతో అగ్రిమెంట్ జరిగిందని, కానీ ఏ మిల్లరు రైతుల నుంచి పూర్తిగా ధాన్యం కొనలేదని ఆరోపించారు. కొట్పాడ్లో 605 మంది రైతులు సహకార సమితిలో సభ్యులుగా చేరారన్నారు. వారిలో 181 మంది రైతుల నుంచి ధాన్యం కొన్నారని వెల్లడించారు. 605 మంది రైతుల వద్ద 62,514 క్వింటాళ్ల ధాన్యం ఉన్నాయని, 15,868 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొన్నారన్నారు. మిగతా ధాన్యం మండీలు, ఇళ్ల వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఈ నెల 2 నుంచి 18వ తేదీ వరకు అంటే 17 దినాలలో 15,868 క్వింటాళ్ల దాన్యం కొన్నారని, ఇంకా 13 దినాలు మాత్రం మిగిలి ఉన్నాయన్నారు. ఈ పరిస్థితిలో రోజుకు రెండు ట్రక్కుల రావటం కష్టంగా ఉందని, కొన్ని దినాలలో అసలు ట్రక్కులే రావటం లేదని వెల్లడించారు. ట్రక్కులు మిల్లర్ల చేతులలో ఉన్నాయన్నారు. మండీ బాధ్యతలు నిర్వహిస్తున్న సహకార సమితి, మార్కెటింగ్ ఇన్స్పెక్టర్ కలుగజేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని అధికారులకు తెలిపినా పట్టించుకోవటంలేదని ఆరోపించారు. అధికారుల నిర్ణయం ప్రకారం ఈ నెల 30వ తేదీలోగా ఎన్ని ధాన్యం కొంటారని ప్రశ్నించారు. అందు వల్ల మరో 15 రోజులు సమయం పెంచాలని రైతులు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సంజయ కుమార్ నాయక్, సుమన్ నాయక్,సీతారాం సామంతరాయ్, తదితరులు పాల్గొన్నారు.