ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఏపీఐటీసీవో లిమిటెడ్ నిపుణుల బృందం సోమవారం పరిశీలించింది. ఏపీఐటీసీవో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మెహ్రా నేతృత్వంలో బృంద సభ్యులు ఆలయానికి చేరుకున్నారు. తొలుత ఈవో శీనానాయక్, కమిటీ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పనులపై సమీక్షించారు. అనంతరం నూతన క్యూ కాంప్లెక్స్, అడ్మి నిస్ట్రేషన్ ఆఫీసు భవనానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికపై చర్చించారు. మహా మండపం ఎదుట నిర్మిస్తున్న అన్నదానం, ప్రసాదాల పోటు భవనాలను పరిశీలించారు. అన్నదానం భవనం సెల్లార్ను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఈఈ ఎల్.రమ, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.


