తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే
భద్రత ఏది బాబు..
రాష్ట్రంలో ప్రజలకే కాదు.. ఆలయాల్లో భక్తులకూ భద్రత కరువైంది
● కాశీబుగ్గ ఘటనలో మృతులకు
రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి
● ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ నేతల
డిమాండ్
● విజయవాడలో కాశీబుగ్గ మృతులకు
సంతాపంగా వైఎస్సార్ సీపీ
క్యాండిల్ ర్యాలీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ప్రజలకే కాదు.. ఆలయాలకు వచ్చే భక్తులకూ భద్రత కరువైందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. చంద్రబాబు పాలన అంటే అన్ని వర్గాలు భయాందోళనతో బతకాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతులకు సంతాపకంగా.. వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు అంటూ నినాదాలు చేశారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన చేతకాని తనం, నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎంత మంది మృతి చెందారో చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఒకవైపు పాలన గాలికొదిలేసి, లా అండ్ ఆర్డర్ను పట్టించుకోకపోవడం వల్ల ప్రజల భద్రత, ముఖ్యంగా దేవాలయాలకు వెళ్లే భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ చేసి విష ప్రచారం మొదలుకొని, దేవుళ్ల పేరుతో చంద్రబాబు తన రాక్షస రాజకీయంతో అనేక విషాదాలు, ఘోరా లు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రచార పిచ్చితో గోదా వరి పుష్కరాల్లో 20 మంది మృతి చెందారన్నారు. సనాతన ధర్మం అని చెప్పిన పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలన్నారు.
పార్టీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ హోం మంత్రి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, భక్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. రాజకీయాలకు తిరుపతి లడ్డూని వాడుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జగ్గయ్యపేట వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరావు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నత్తా యోనారాజు, ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు విజిత, నేతలు రవిచంద్ర, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆలయాల్లో జరిగిన అపచారాలు, ఘోరాలు అన్నీ ఇన్నీ కావన్నారు. శ్రీకూర్మంలో తాబేళ్లపార్కు నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంతో తాబేళ్లు మృత్యువాత, టీటీడీ బోర్డులో క్రిమినల్ కేసులున్న వారికి సభ్యత్వం, తిరుమలలోని గోశాలలో వందకు పైగా గోవులు మృతి వంటి అనేక అపచారాలు జరిగాయన్నారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందన్నారు.
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏకాదశి సందర్భంగా భక్తులు వస్తారని తెలిసినా కాశీబుగ్గలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పుడు ప్రైవేటు ఆలయం, ఎలాంటి సమాచారం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రొద్దుటూరు శ్రీ వాసవీ పరమేశ్వరి ఆలయం, అనకాపల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, సీతానగరంలో విజయకీలాద్రి, ద్వారంపూడిలో అయ్యప్పస్వామి ఆలయం వంటి అనేక ప్రైవేటు ఆలయాలు ఉన్నాయని, పర్వదినాలు, వేడుకల సమయంలో భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. తిరుమల తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలంలో జరిగిన ఘటనలో ఏడుగురు భక్తులు బలయ్యారన్నారు. ఇప్పుడు కాశీబుగ్గలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


