
ఏపీ రోలర్ స్కేటర్లకు పతకాలు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): దక్షిణ కొరియాలోని జెచియోన్లో గత నెల 19 నుంచి 29వ తేదీ వరకు జరిగిన 20వ ఆసియా రోలర్–స్కేటింగ్ చాంపియన్ షిప్లో వివిధ విభాగాల్లో ఏపీకి చెందిన చెందిన రోలర్ స్కేటర్లు ప్రతిభ చూపి పతకాలు సొంతం చేసుకున్నారని రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగీరథ్ చెప్పారు. దక్షిణ కొరియాలో జరిగిన చాంపియన్ షిప్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిరోపోర్టులో ఫెడరేషన్ సభ్యులు వీరికి స్వాగతం పలికి అభినందించారు. భగీరథ్ మాట్లాడుతూ వివిధ విభాగాలు, కేటగిరీల్లో పతకాలు పొందారన్నారు. రసిల్–గోల్డ్, దినేష్–సిల్వర్, క్షేత్ర–సిల్వర్, జెస్సిరాజ్–సిల్వర్, హరికమల్–కాంస్య, అన్మిష–కాంస్య, సంహిత–గోల్డ్, గ్రీష్మ–గోల్డ్, చేబోయిన ఆర్యని–సిల్వర్, సాయి కార్తీక్–కాంస్య పతకాలు పొందారని వివరించారు. ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.థామస్, వైస్ ఉపాధ్యక్షుడు బి.మురళీకృష్ణ, అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులను అభినందించారు.
జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
మైలవరం: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టర్స్ ఎంపికై నట్లు సంఘ జిల్లా అధ్యక్షుడు బి. వెంకట్రావు శుక్రవారం తెలిపారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్లో ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ స్థాయి మాస్టర్స్ కేటగిరి వపర్ లిఫ్టింగ్ పోటీల్లో మహిళా విభాగంలో ఎం. లక్ష్మి 69 కిలోల విభాగం, కె.వరలక్ష్మి 76 కిలోల విభాగంలో ఎంపికయ్యారన్నారు. పురుషులు.. 83 కిలోల విభాగంలో గంటా వెంకటేశ్వర్లు, 93 కిలోల విభాగంలో పి. నరసింహారావు, 93 కిలోల విభాగంలో పి.వి.సుబ్బారావు, 105 కిలోల విభాగంలో కె.బాబూరావు ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మల్లేశ్వరరావు, ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సూర్యనారాయణ, గంటా వెంకటేశ్వరరావు అభినందించారు.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు అక్కాచెల్లెళ్లు
విస్సన్నపేట: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక పరీక్షలో విస్సన్నపేట మండలం పుట్రేలకు చెందిన అక్కాచెల్లెళ్లు ఎంపికయ్యారు. అంగిడి శ్రావణి, ఆమె సోదరి సరస్వతి కానిస్టేబుళ్లుగా సెలెక్ట్ అయ్యారు. వీరి సోదరి అంగిడి మాధవి 2014లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికవగా, మరో సోదరుడు వెంకటకృష్ణారావు 2013లో కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు. శ్రావణి, సరస్వతిలను గ్రామస్తులు అభినందించారు.
బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా రోజ్ సొసైటీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పీ 4 విధానంలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకొనేందుకు విజయవాడకు చెందిన రోజ్ సొసైటీ ముందుకు వచ్చింది. శుక్రవారం సొసైటీ ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ వారికి పీ4 విధానం విశిష్టతను వివరించారు. పీ 4లో భాగస్వాములవుతామని, తమ బాధ్యతగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని అండగా ఉంటామని సొసైటీ ప్రతినిధులు కలెక్టర్కు తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో 86,398 బంగారు కుటుంబాలను గుర్తించామని, ఇప్పటికే 4,279 మంది మార్గదర్శులుగా ముందుకొచ్చారన్నారు. 33,505 కుటుంబాలను దత్తత తీసుకున్నారని వివరించారు. పారిశ్రామికవేత్తలతో పాటు రెడ్క్రాస్, రోటరీ, ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) తదితర సంస్థలు ముందుకొచ్చాయన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో సొసైటీ అడ్వైజరీ చైర్పర్సన్ అడుసుమిల్లి సీతామహాలక్ష్మి, ప్రెసిడెంట్ సూరపనేని ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

ఏపీ రోలర్ స్కేటర్లకు పతకాలు