
రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వానికి వెన్నెముక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పరిపాలనలో ప్రాచీన కాలం నుంచి ప్రజలకు సేవలందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వానికి వెన్నెముక లాంటిదని సీసీఎల్ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి అన్నారు. రెవెన్యూ శాఖలో పని చేసే ప్రతి ఉద్యోగి ప్రజలకు పారదర్శకమైన సేవలందించి ప్రభుత్వ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేయాలన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం రెవెన్యూ దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న జయలక్ష్మి రెవెన్యూ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ బ్రిటిష్ వారి హయాంలోనే 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటైందని దీనిని పురస్కరించుకుని ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవం జరుపుతోందన్నారు. ప్రభుత్వ శాఖలన్నింటికి రెవెన్యూ శాఖ తల్లిలాంటిదని, రెవెన్యూ సిబ్బంది పారదర్శకమైన సేవలు అందించినప్పుడే ప్రజలు ప్రభుత్వ విధానాలపై సంతృప్తి చెందగలుగుతారన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేయడం ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన విషయమన్నారు. ఈ శాఖలో వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుని ఆధునిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు సమర్థమైన సేవలను ప్రజలు అందజేసినపుడే మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి కీలక సమయాలలో రెవెన్యూ శాఖ ముఖ్య భూమికను పోషిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను 99 శాతం పైగా పరిష్కరిస్తున్నామని, నూరు శాతం పరిష్కరించి శాఖకు గుర్తింపు తీసుకురావాలన్నారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా రెవెన్యూ రికార్డులు, సర్వే పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. రెవెన్యూ శాఖలో ఉత్తమ సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన పలువురు ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, ఆర్డీఓలు కె.చైతన్య, కె.మాధవి, కె.బాలకృష్ణ, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామిశెట్టి వెంకట రాజేష్, కోశాధికారి సీహెచ్ నరసింహ, సంఘ ప్రతినిధులు రెవెన్యూ అధికారులు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీసీఎల్ఏ స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి