
మానసిక కల్లోలం!
● నిత్యం ఒత్తిడితో యువతలో పెరుగుతున్న మానసిక సమస్యలు ● వ్యాధి నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం ● హార్మోన్ల అసమతుల్యతతో మహిళల్లో పీరియడ్స్ సమస్యలు ● మానసిక ఉల్లాసంపై దృష్టి లేక ఇబ్బందులు ● అదుపులో ఉండని దీర్ఘకాలిక వ్యాధులు
ఒత్తిడితో ఆరోగ్యం చిత్తు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉరుకులు పరుగుల జీవనంలో మానసిక ఒత్తిళ్లు సర్వ రోగాలకు మూలకారణంగా నిలుస్తున్నాయి. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతోందని, ఇన్ఫెక్షన్స్తో పాటు అనేక సమస్యలకు దారితీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అంతేకాక డిప్రెషన్తో తీవ్రమైన మానసిక రుగ్మతలకు దారితీస్తున్నట్లు వివరిస్తున్నారు. గజిబిజి యాంత్రిక జీవన విధానంలో మానసిక ఉల్లాసంపై దృష్టి సారించక పోవడంతో వ్యాధులు చుట్టుముట్టడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
కొరవడిన మానసికోల్లాసం..
నగరంలోని పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా ప్రాంగణాలు లేని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 నుంచి రాత్రి 7గంటల వరకూ పుస్తకాలతోనే కుస్తీ పట్టించడంతో పిల్లల్లో సృజనాత్మకత దెబ్బతినడంతో పాటు, జ్ఞాపకశక్తిని కోల్పోతున్నట్లు, మానసిక నిపుణులు వివరిస్తున్నారు. ఆటపాటలతో చదివిన వారిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని, బట్టీ చదువులతో రోబోలుగా మారుతున్నారని అంటున్నారు. అంతేకాక వారిలో సామాజిక, నైతిక విలువలు కూడా పెంపొందడం లేదని చెబుతున్నారు. విద్యార్థుల ఆకాంక్షను పట్టించుకునే పరిస్థితి లేదు.
ఎలా గుర్తించాలంటే..
నిద్రలేమితో బాధపడుతున్నారా.. ఎల్లప్పుడూ దిగులుగా అనిపిస్తోందా.. ఏకాగ్రతా సమస్యలు బాధిస్తోందా.. అయితే మానసిక నిపుణుల సలహా ఎంతో అవసరం. ఇలాంటి వారు క్లిష్టపరిస్థితుల్లో నికోటిన్, డ్రగ్స్, ఆల్కాహాల్తో పాటు ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పిల్లల్లో తరచూ కోపం, చికాకు పడటం, తలను గోడకేసి కొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మానసిక అశాంతికి కారణమయ్యే వ్యతిరేక భావనలు పెరిగిపోతుంటే తక్షణమే కౌన్సెలింగ్ పొందడం, ఆరోగ్య సలహా తీసుకోవడానికి మొహమాటపడకండి. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే నిపుణులను సంప్రదించండి.