
పాలనంతా విధ్వంసమే
చంద్రబాబు విఫల పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అవినాష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిస్తోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఏడాది విధ్వంసకర పాలనకు ఈ పుస్తకం అద్దం పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై ‘వైఎస్ జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’ పేరుతో ముద్రించిన పుస్తకాన్ని గుణదలలోని పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నేతలతో కలిసి పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కేయడం, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి తప్పుడు కేసులు బనాయించడం మినహా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కూటమి నాయకులు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని, అందుకు ఉదాహరణలను సవివరంగా, ఫొటోలతో సహా వైఎస్సార్ సీపీ ఈ పుస్తకాన్ని ప్రచురించిందన్నారు. రాష్ట్రంలో గత ఏడాది కాలంగా వ్యవస్థల నిర్వీర్యం నుంచి ప్రజాస్వామ్య విధ్వంసం వరకు ఈ పుస్తకంలో రాసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు కలపాల అంబేడ్కర్, వియ్యపు అమర్నాథ్, తంగిరాల రామిరెడ్డి, పుప్పాల కుమారి, కో ఆప్షన్ సభ్యుడు ముసునూరు సుబ్బారావుతో పాటు, పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.