గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నాణ్యతతో అర్జీలకు పరిష్కారం చూపాలని, పునరావృతం కాకుండా సమస్యను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నుంచి సమాచారం సేకరించి పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు ఏ స్థాయి లోనూ పునరావృతం కాకూడదని, సమస్య పరిష్కారంతో అర్జీదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, అర్జీలను ఆడిటింగ్ చేస్తామని చెప్పారు.
వచ్చిన అర్జీలు ఇవి..
రెవెన్యూ శాఖకు సంబంధించి 45, పోలీస్ శాఖకు 19, ఎంఏయూడీ 17, విద్య 16, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 10, డీఆర్డీఏ 9, పౌరసరఫరాలు 4, ఏపీసీపీడీసీఎల్ 3, హెల్త్ 3, పంచాయతీరాజ్ 3, ఆర్అండ్బీ 3, ఆర్డబ్ల్యూఎస్ 3, కళాశాల విద్య 2, విభిన్న ప్రతిభావంతులు 2, గ్రామ వార్డు సచివాలయం 2, ఇంటర్మీడియెట్ 2, మార్కెటింగ్ 2, గనులు, భూగర్భశాఖ 2, రిజిస్ట్రేషన్ 2, నైపుణ్య అభివృద్ధి 2, సర్వే 2, వ్యవసాయం, బ్యాంకు రిలేటెడ్, కోఆపరేటివ్, మెప్మాకు సంబంధించి ఒక్కో అర్జీ కలిపి మొత్తం 157 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించినట్లు కలెక్టర్ చెప్పారు. ఇందులో 42 అర్జీలను స్వయంగాను 115 అర్జీలను ఆన్లైన్ ద్వారా స్వీకరించిన్నట్లు తెలిపారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి పాల్గొన్నారు.
అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ పీజీఆర్ఎస్లో 157 అర్జీల స్వీకరణ