ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ గోడు పట్టదా? | - | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ గోడు పట్టదా?

Jun 17 2025 7:01 AM | Updated on Jun 17 2025 7:01 AM

ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ గోడు పట్టదా?

ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ గోడు పట్టదా?

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కూటమి ప్రభుత్వం మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ గోడు పట్టించుకోవడం లేదని ఇంజినీరింగ్‌ విభాగం కార్మిక సంఘాల జేఏసీ విమర్శించింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు 41 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడింది. కార్మికులను చర్చలకు పిలిచి ఎటువంటి హామీ ఇవ్వకుండా తిప్పి పంపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌ నందు సోమవారం మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు వైఎస్సార్‌ సీపీ సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌, ఇఫ్టూ రాష్ట్ర నాయకులు కె. పోలారి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ ఈదులమూడి మధుబాబు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెల 9వ తేదీన వడ్డేశ్వరంలోని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయంలో సమ్మె నోటీసు ఇచ్చామని చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందుకు మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని ధ్వజమెత్తారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఇతర సంఘాలతో కలిసి ఈనెల 22 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ప్రజలందరికీ అందుబాటులో ఉండే మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని వైఎస్సార్‌ సీపీ సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణు అన్నారు. 40 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ ధర్నాలో ఏపీ మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బాబా ఫక్రుద్దీన్‌, జేఏసీ కో కన్వీనర్‌ వేముల జైపాల్‌, పిట్టా మహేష్‌, వివిధ జిల్లాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement