
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు
రామవరప్పాడు/గుణదల: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, ఏడాది కూటమి పాలనలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని పలువురు మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో ఏడాది కూటమి పాలన– మహిళలకు వంచన అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనలో మహిళల జీవితాలు తలకిందులయ్యాయన్నారు. అవినీతి పాలనతో రాష్ట్రం అప్పుల ఆంధ్రాగా మారిందని, మహిళలకు దశ, దిశ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడమే అఘాయిత్యాలకు ప్రధాన కారణమన్నారు.
రబ్బరు స్టాంప్లా హోం మంత్రి..
మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. జగనన్న తెచ్చిన దిశ యాప్ను ప్రస్తుత హోంమంత్రి హేళనగా మాట్లాడారని, నేడు అదే యాప్ పేరు మార్చి శక్తి అని పెట్టారన్నారు. జగనన్న కంటే ఎక్కువ పథకాలిస్తానని నమ్మించి ప్రజలను మోసం చేశారన్నారు. హోంమంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్ మాదిరిగా మారారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ గాడి తప్పిందని, ఏడాది కాలంలోనే టీచర్లను రోడ్డు మీదకు లాగేశారని ఆరోపించారు. బదిలీల్లో టీచర్లను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పాఠశాలల సమీపంలో మద్యం షాపులు పెట్టారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఏపీ ప్రశాంతంగా ఉండాలంటే జగనన్నను మళ్లీ సీఎంగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తిరుపతి మేయర్ శిరీష, విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ మేయర్ గొలగాని వెంకట హరికుమారి, మాజీ ఎమ్మెల్సీ శివకుమారి, ఏపీఐడీసీ మాజీ చైర్పర్సన్ బండి పుణ్యశీల తదితరులు పాల్గొన్నారు.
నిత్యం మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి
చర్చా వేదికలో వైఎస్సార్సీపీ
మహిళా నేతల ఆవేదన