
బలమైన వస్తువుతో కొట్టిన భార్య
చల్లపల్లి: బలమైన వస్తువుతో భార్య కొట్టడంతో మతిస్థిమితంలేని భర్త మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి నారాయణరావునగర్లో చోటుచేసుకుంది. విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంతో ఘటన ఒక రోజు ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. చల్లపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘంటసాల మండలం దేవరకోటకు చెందిన బోలెం శ్రీనివాసరావు(45)కు చిట్టూర్పు గ్రామానికి చెందిన మంగమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొత్తలో శ్రీనివాసరావు తలకు బలమైన దెబ్బతగలటంతో మతిస్థిమితం కోల్పోయాడు. అప్పటికే గర్భణి అయిన మంగమ్మ శ్రీనివాసరావును వదిలి వెల్లిపోయింది. అప్పటి నుంచి శ్రీనివాసరావు దేవరకోటలోని తండ్రి గురునాథప్రసాద్ ఇంటివద్దే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా మంగమ్మ కొడుకు కార్తీక్ను వెంటబెట్టుకుని ఐదు నెలల క్రితం దేవరకోటకు వచ్చింది. తాను కొంత కాలంగా చల్లపల్లి నారాయణరావునగర్లో ఉంటున్నానని భర్త శ్రీనివాసరావు కావాలని ఆయనతోనే ఉంటామని నమ్మబలికింది. మామ గురునాథప్రసాద్ వారిద్దరినీ దేవరకోటలోనే అక్కడే ఉండనిచ్చారు. అక్కడ ఒక నెల ఉన్న తర్వాత నాలుగు నెలల క్రితం మంగమ్మభర్త శ్రీనివాసరావును తీసుకుని చల్లపల్లి నారాయణరావునగర్ కాలనీలో తాను ఉంటున్న ఇంటికి వచ్చేసింది. మంగమ్మ రోజువారీ పనికి వెళుతుండగా కొడుకు కార్తీక్ కూలిపనులకు వెళ్లివస్తుంటాడు. మతిస్థిమితంలేని శ్రీనివాసరావు ఇంటి వద్దే ఉంటున్నాడు.
భర్త శరీరంపై గాయాలు చూపించి..
ఇలా ఉండగా శనివారం ఉదయం మంగమ్మ తన భర్త శ్రీనివాసరావును తీసుకుని స్థానిక పోలీస్టేషన్కు వెళ్లింది. శ్రీనివాసరావు వంటిపై గాయాలు చూపించి తన భర్తను మామ, మరిది ఇద్దరూ కలిసి కొట్టారని వారిని మందలించాలని కోరింది. అదేరోజు సాయంత్రం 5గంటల సమయంలో మంగమ్మ పోలీసులకు ఫోన్ చేసి తన భర్త అన్నం తింటూ చనిపోయాడని తెలిపింది.
పైళ్లెన కొత్తలో కూడా..
రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేయగా మంగమ్మ తరచూ శ్రీనివాసరావును కొడుతుంటుందని 20 ఏళ్ల క్రితం పైళ్లెన కొత్తలో కూడా ఆమె కొట్టడంతో అతను మతిస్థిమితం కోల్పోయాడని తేలిందని చెప్పారు. నాలుగు నెలల నుంచి కూడా అడపాదడపా మంగమ్మ శ్రీనివాసరావును కొడుతోందని ఈ కోవలోనే శనివారం కూడా ఆమె బలమైన వస్తువుతో శ్రీనివాసరావు తలపై కొట్టగా అతను పడిపోయి మరణించినట్లు చెప్పారు. మృతుడు తండ్రి గురునాథ్ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.ఎస్.వి.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి శ్రీనివాసరావు దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ కె.ఈశ్వరరావు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మతిస్థిమితం లేని భర్త మృతి కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఘటన