కూటమి ఏడాది పాలన అట్టర్‌ ఫ్లాప్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమి ఏడాది పాలన అట్టర్‌ ఫ్లాప్‌

Jun 16 2025 7:21 AM | Updated on Jun 16 2025 7:21 AM

కూటమి ఏడాది పాలన అట్టర్‌ ఫ్లాప్‌

కూటమి ఏడాది పాలన అట్టర్‌ ఫ్లాప్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అట్టర్‌ ఫ్లాప్‌ అని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. ఐదుకోట్ల మంది ప్రజలను మభ్యపెట్టి అఽధికారంలోకి వచ్చాక, మేనిఫెస్టోను అమలు చేయకుండా గాలికొదిలేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై 120 పేజీలతో ముద్రించిన పుస్తకాన్ని ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో కలిసి వేణుగోపాలరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరెడ్డి మాట్లా డుతూ.. 2019 వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టో ఎలా అమలైందో, కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని ప్రజలు గమనించారన్నారు. దేవినేని అవినాష్‌ నాయకత్వంలో జిల్లాలో అనేక పోరాటాలు చేస్తామని చెప్పారు.

చైతన్యవంతులను చేస్తాం

వచ్చేది వైఎస్సార్‌ సీపీనే అని కూటమి ప్రభుత్వానికి, అధికారులకు అర్థమైందన్నారు. ఈ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. కూటమి పిచ్చి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాదిగా రెడ్‌బుక్‌ పాలన సాగిస్తోందని విమర్శించారు. పరిపాలన ఎలా ఉందో, ప్రజలను ఎలా మోసం చేసిందో ఈ పుస్తకం రూపంలో ప్రజల దగ్గరికి తీసుకొచ్చామన్నారు. వరదలు వచ్చి విజయవాడ మునిగితే ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. తల్లికి వందనాన్ని 30 లక్షల మందికి ఎగ్గొటారని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి రెడ్‌బుక్‌ చూపించి భయపెడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చామని, కూటమి నాయకులు ఏ సవాల్‌ విసిరినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ప్రజలు జగన్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.

ప్రజలకు వెన్నుపోటు

మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాల్సిన సమయం వచ్చిందన్నారు. కూటమి మోసపూరిత హామీలతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఈ పుస్తకాన్ని తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్‌ మాట్లా డుతూ.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రతి కార్యాలయంలో మేనిఫెస్టో పెడితే, కూటమి మాత్రం రాష్ట్రం అంతా ఓ రెడ్‌బుక్‌ రాజ్యాంగం సాగిస్తోందన్నారు. వారిచ్చిన 153 హామీలు ఊసే లేదన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్నారన్నారు. జగ్గయ్యపేట పార్టీ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలు తిరుగుబాటు చేస్తారనే భయంతోనే అరకొరగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ప్రజల అండగా వైఎస్సార్‌ సీపీ కూటమి ప్రభుత్వ మెడలు వంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజ, నేత నాగేంద్రపుణ్యశీల తదితరులు పాల్గొన్నారు.

ఐదు కోట్ల మంది ప్రజలను నమ్మించి మోసం చేశారు కూటమి మేనిఫెస్టోను గాలికి వదిలేశారు చంద్రబాబు అంటే మోసం.. జగన్‌ అంటే నమ్మకం వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా పరిశీలకుడు మోదుగల వేణుగోపాలరెడ్డి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలపై పుస్తకావిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement