వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా తూర్పు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆదివారం తూర్పు డెల్టా కాలువలకు నీటిని విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల తర్వాత రైవస్ కాలువకు 700, బందరు కాలువకు 300 మొత్తంగా 1000 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రైతులు సకాలంలో పంటలను వేసి తుపానుల నుంచి రక్షణ పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సాగు నీటి వినియోగ దారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో
వ్యక్తి ఆత్మహత్య
కంకిపాడు: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై స్థానిక పీఎస్లో ఆదివారం కేసు నమోదైంది. ఎస్ఐ డి.సందీప్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని పునాదిపాడు ఎస్సీ కాలనీకి చెందిన కొప్పులు ముత్తయ్య (45) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. సుమారు పదేళ్ల క్రితం భార్య మృతి చెందింది. ముత్తయ్య మనోవేదన చెందుతూ మద్యానికి అలవాటు పడ్డాడు. కుటుంబ పోషణ నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ బాధలు తట్టుకోలేక ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పై కప్పు రాడ్డుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించే సరికి మృతి చెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కృష్ణలో పడి
యువకుడి గల్లంతు
శ్రీకాకుళంలో ఘటన
శ్రీకాకుళం(ఘంటసాల): బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి యువకుడు గల్లంతైన ఘటన ఘంటసాల మండలం శ్రీకాకుళంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఘంటసాల ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన ఆత్కూరి ధర్మరాజు కుమారుడు ఫణి కుమార్ (25) ఆదివారం సాయంత్రం కృష్ణానది వైపు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఎంపీటీసీ తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా)కు తెలిపి గ్రామస్తులతో కలసి ఘటనా స్థలానికి వెళ్లి వెదికారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ప్రతాప్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పడవలు, స్థానికులతో కృష్ణానదిలో వెదుకులాట ప్రారంభించడంతో పాటు ఎస్డీఆర్ఎఫ్కు సమాచారమిచ్చారు. శ్రీకాకుళం వీఆర్వో డి.గోపి సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని విషయాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రిక్షా లాగుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రికి ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా పని చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న ఫణి కుమార్ అందరితో కలివిడి ఉంటారని గ్రామస్తులు తెలుపుతున్నారు.
ఆటోలో వెళ్తూ
రోడ్డుపై పడి వ్యక్తి మృతి
కంచికచర్ల: ఓ వ్యక్తి ఆటోలో ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలూ మృతిచెందిన ఘటన కంచికచర్లలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వేములపల్లి గ్రామానికి చెందిన గుడిసె నరసింహారావు(31) అనే వ్యక్తి కీసరలో ఆటో ఎక్కి కంచికచర్ల బయలుదేరారు. ఆటోలో మరో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. నరసింహారావు ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. కంచికచర్ల కంచిలమ్మ చెరువుకట్ట సమీపంలో రాగానే ప్రమాదవశాత్తు రోడ్డుపై పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాధితుడిని వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
కాలువలకు సాగునీరు విడుదల