
రోడ్డు ప్రమాదంలో లారీడ్రైవర్ దుర్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ద్విచక్ర వాహనం అదుపుతప్పి వారధి ఫ్లైఓవర్పై నుంచి జాతీయ రహదారిపై పడి అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాల మేరకు తెల్లగడ్ల కాశీరాము(30) లారీ డ్రైవర్. అతను కుటుంబంతో కలిసి గుంటూరులో నివసిస్తున్నాడు. అతనికి భార్య ప్రవల్లిక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం అతని భార్య పిల్లలతో కలిసి రాణిగారితోటలోని పుట్టింటికి వచ్చింది. భార్య, పిల్లలను చూసేందుకు కాశీరాము తన ద్విచక్ర వాహనంపై ఆదివారం రాత్రి గుంటూరు నుంచి రాణిగారితోటకు బయలుదేరాడు. రాత్రి 9.30 గంటల సమయంలో వారధి దాటి ఫ్లైఓవర్ మీద ప్రయాణిస్తూ వాహనం అదుపుతప్పి సైడ్వాల్ను ఢీకొట్టాడు. అతను ఫైఓవర్పై నుంచి కింద జాతీయ రహదారిపై పడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుని వివరాల సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.