హ్యూస్టన్‌లో నాట్స్ మెన్స్ సింగిల్స్ టెన్నిస్‌ టోర్నమెంట్‌

 Nats Tennis Tournament In Hustan - Sakshi

హ్యూస్టన్‌: తెలుగు వారి కోసం అమెరికాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్... తాజాగా వారిలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మెన్స్ సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. స్థానికంగా ఉండే తెలుగు ప్రజలు ఈ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు.

నాట్స్ హ్యూస్టన్ క్రీడా సమన్వయకర్త చంద్ర తెర్లీ నేతృత్వంలో ఈ టోర్నమెంట్ జరిగింది. నాట్స్ హ్యూస్టన్ సమన్వయకర్త వీరు కంకటాల, నాట్స్ నాయకులు సునీల్ పాలేరు, హేమంత్ కొల్ల, శ్రీనివాస్ కాకుమాను తదితరులు విజయవంతంగా టోర్నమెంట్‌ నిర్వహించేందుకు కృషి చేశారు. హ్యూస్టన్, గ్రేటర్ హ్యూస్టన్ ప్రాంతంలోని తెలుగువారందరికీ నాట్స్ ఎప్పుడూ వెన్నంటి ఉండి తమ సహాయ సహకారాలను అందిస్తుందని బోర్డు సభ్యులు సునీల్ పాలేరు అన్నారు.

చక్కటి సమన్వయంతో, క్రీడా స్ఫూర్తితో, ఎక్కడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ పోటీలు నిర్వహించిన నాట్స్ హ్యూస్టన్ విభాగానికి  కేంద్ర కమిటీ సభ్యులు, సహాయ కోశాధికారి హేమంత్ కొల్ల అభినందనలు తెలిపారు. క్రీడా నైపుణ్యత ఆధారంగా రెండు విభాగాలుగా జరిగిన ఈ పోటీలకు ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న క్రీడాకారులకు నాట్స్ ట్రోఫీలను అందజేసి సత్కరించింది.  తెలుగు వారిలో ఉత్సాహం నింపేందుకు ఇలాంటి టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడంపై నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, ప్రెసిడెంట్ శేఖర్ అన్నే  నాట్స్ హ్యూస్టన్ విభాగాన్ని అభినందించారు.


 

చదవండి: 500 కార్మిక కుటుంబాలకు నాట్స్ సాయం

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top