సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో అంతిమ కష్టాలు తీర్చేందుకు దారి సుగమమైంది. శ్మశాన వాటిక అభివృద్ధికి ముందుకొచ్చిన ఎస్ఆర్ ఫౌండేషన్కు మున్సిపాలిటీ అనుమతి లేఖ అందజేసింది.దింపుడుకళ్లెం దిమ్మె కూడా లేని కామారెడ్డిలోని ప్రధాన శ్మశాన వాటికలో నెలకొన్న కష్టాలపై ఏప్రిల్ 20న ‘సాక్షి’లో ‘అంతిమ కష్టం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. సమస్య తీవ్రతను చూసి ఎందరో చలించిపోయారు. లక్షకుపైగా జనాభా ఉన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైకుంఠధామాల దుస్థితిని చూసి అవాక్కయ్యారు. ఈ కథనం ప్రచురితమైన రోజే జరిగిన మున్సిపల్ సమావేశంలో ఆయా పార్టీల కౌన్సిలర్లు సాక్షి క్లిప్పింగ్ను చూపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి ‘సాక్షి’ కథనాన్ని చదివి చలించిపోయారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం స్థాయిలో శ్మశాన వాటికను తీర్చిదిద్దడానికి ముందుకువచ్చిన ఆయన.. తన ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధుల ద్వారా జిల్లా అధికారులకు లేఖను అందించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సుభాష్రెడ్డిని కలిసి అభినందించారు. పట్టణంలోని పలు కుల సంఘాల ప్రతినిధులు సమావేశమై ఎస్ఆర్ ఫౌండేషన్కు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు.
‘అంతిమ కష్టం’ తీరే దారిలో..
ఇటీవలే తీర్మానం చేసిన బల్దియా
తాజాగా ఎస్ఆర్ ఫౌండేషన్కు అనుమతి లేఖ అందజేత


