
సంక్షేమం, అభివృద్ధి పనులపై దిశానిర్దేశం
నిజామాబాద్అర్బన్ : నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై మండలాల వారీగా చర్చిస్తూ, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సజావుగా జరిగేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులతోపాటు మండల స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లు, అంగన్వాడీ, ఆసుపత్రులు వంటి వాటికి సంబంధించిన అసంపూర్తి భవనాలను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ బడులలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను గుర్తిస్తూ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రతిపాదనలు సమర్పించేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్తాయిలో పరిశీలిస్తూ, నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపని లబ్ధిదారుల నుంచి రాతపూర్వకంగా లేఖలు తీసుకోవాలని, వారి స్థానంలో అర్హులైన ఇతరులకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు. నియోజకవర్గాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన వారికి కేటాయించాలని తెలిపారు. ఎక్కడైనా ఎరువులను దారి మళ్లించినట్లు తెలిస్తే రైతులు, ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేసేలా సూచించాలని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అయినందున, కొత్త కార్డులు, సభ్యుల పేర్ల నమోదు కోసం వచ్చే దరఖాస్తులను వెనువెంటనే పరిశీలించాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
మండలాల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి