
పద్మవ్యూహంలో ఇందూరు
సుభాష్నగర్: ట్రాఫిక్ సమస్యతో ఇందూరు నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. పద్మవ్యూహంలో నుంచి బయట పడేందుకు నరకయాతన పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ తోపుడు బండ్ల వ్యాపారాలు, అక్రమ పార్కింగ్లతో ఫుట్పాత్లు కానరాకుండా పోయాయి. దీంతో ప్రజలు రోడ్లపైనే నడుస్తూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఫుట్పాత్లు మాయం..
జిల్లా కేంద్రంలో ఎక్కడా ఫుట్పాత్లు కనిపించడం లేదు. ప్రధానంగా ఖలీల్వాడి, కుమార్గల్లి, పూసలగల్లి, బస్టాండ్, రైల్వేస్టేషన్, కంఠేశ్వర్, గంజ్ రోడ్, వీక్లీ బజార్, వినాయక్నగర్, సుభాష్నగర్, శ్రీనగర్ కాలనీ, ప్రగతి నగర్, హైదరాబాద్ రోడ్, ఆర్మూర్ రోడ్పై అక్రమ పార్కింగ్కు అడ్డాగా మారింది. ఖలీల్వాడి, బస్టాండ్, రైల్వేస్టేషన్, వీక్లీబజార్, హైదరాబాద్ రోడ్, ఆర్మూర్ రోడ్లపై తోపుడు బండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో ఈ ప్రాంతాల్లో ఫుట్పాత్లు లేక పాదచారులు రోడ్లపైనే నడుస్తున్నారు.
మార్పులు అవసరం..
నగరంలో సుమారు 5 లక్షల మంది నివసిస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో ప్రజలు వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం నిజామాబాద్లో 1972 మాస్టర్ ప్లాన్ అమలవుతోంది. కొన్ని రోడ్లు మినహా మిగతావన్నీ చిన్నగా ఉన్నాయి. రోడ్ల విస్తరణకు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఎలాంటి చొరవ తీసుకోకపోవడం, గడిచిన 15 ఏళ్లలో వాహనాల వినియోగం విపరీతంగా పెరగడం ట్రాఫిక్ ఇక్కట్లకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాటు, వన్ వే, రోడ్లపై నుంచి తోపుడు బండ్ల వ్యాపారాల తొలగింపు, అక్రమ పార్కింగ్లపై స్పెషల్ డ్రైవ్ తదితర మార్పులు చేయాలని అభిప్రాయపడుతున్నారు.
ట్రాఫిక్ చిక్కులు
అక్రమ పార్కింగ్, తోపుడు బండ్ల వ్యాపారాలతో కనిపించని ఫుట్పాత్లు
రోడ్లపైనే నడుస్తున్న ప్రజలు
ఇబ్బంది పడుతున్న వాహనదారులు
ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చాలి
నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. వాహనం నడపాలంటేనే భయమేస్తుంది. ఖలీల్వాడి, కుమార్గల్లి, వీక్లీమార్కెట్లో వాహనం నిలపడానికి కూడా స్థలం లేదు. తోపుడు బండ్లతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు స్పందించి ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చాలి.
– రచ్చ ఆనంద్, బోర్గాం(పి)

పద్మవ్యూహంలో ఇందూరు

పద్మవ్యూహంలో ఇందూరు