
ఆలయంలో చోరీ
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా జగదాంబ ఆలయంలో చోరీ జరిగినట్లు తండావాసులు ఆదివారం తెలిపారు. ఆలయంలో శనివారం పూజలు చేసి వెళ్లిన పూజారి దుష్యానాయక్ ఆదివారం ఉదయం గుడిని తెరిచేందుకు వెళ్లగా ఆలయంలోని హుండీ బయట ఉండటాన్ని గమనించి తండావాసులకు సమాచారం ఇచ్చారు. హుండీని పరిశీలించిన తండా వాసులు అందులో సుమారు రూ. 30వేల నగదు ఉన్నదని, గుర్తుతెలియని దుండుగులు చోరీ చేశారన్నారు. ఘటనపై వారు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ధాన్యం లారీ బోల్తా
డిచ్పల్లి: మండలంలోని సాంపల్లి గ్రామం వద్ద గల 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం ధాన్యం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డిచ్పల్లి వైపు నుంచి ఆర్మూర్ వైపు ధాన్యం బస్తాల లోడుతో వెళుతున్న లారీని రహదారి పక్కన నిలిపే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ క్షేమంగా బయటపడినట్లు డిచ్పల్లి పోలీసులు తెలిపారు.