
లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలి
నిజామాబాద్నాగారం: జీవితంలో ప్రతి ఒక్క రూ ఒక లక్ష్యాన్ని ఎంచుకుని, ఆ లక్ష్య సాధన కోసం కష్టపడుతూ ముందుకు సాగితే ఫలితం దక్కుతుందని సీపీ పి సాయిచైతన్య అన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన తెలంగాణలోని 11 జిల్లాల విద్యార్థినీవిద్యార్థులు 200 మందికి ఎమ్మెస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10వేల చొప్పు న ప్రోత్సాహకాలు అందజేశారు. నగరంలోని బస్వాగార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఆర్థికస్థితిగతులతో సంబంధం లేకుండా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎమ్మెస్సార్ ట్రస్ట్ నగదు ప్రోత్సాహకాలు అందజేసిందన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం పైతరగతులకు వెళ్తున్న విద్యార్థులు కొత్త పరిచయాలను తమ ఉన్నతి కోసం వాడుకోవాలని సూచించారు. చెడు పరిచయాలకు దూరంగా ఉండాలని, కొత్త పరిచయాల క్రమంలో మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దన్నారు. వ్యక్తిత్వ వికాసం కోసం కష్టపడాలన్నారు. ఎమ్మెస్సార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం సాంబశివారెడ్డి, డైరెక్టర్లు ధనుష్రెడ్డి, జి.రాజిరెడ్డి, డాక్టర్ అబ్బాపూర్ రవి, వడ్డె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.