రాజీ పద్ధతిలో సత్వర న్యాయ పరిష్కారానికి అవకాశం | - | Sakshi
Sakshi News home page

రాజీ పద్ధతిలో సత్వర న్యాయ పరిష్కారానికి అవకాశం

Jun 15 2025 7:18 AM | Updated on Jun 15 2025 7:18 AM

రాజీ పద్ధతిలో సత్వర న్యాయ పరిష్కారానికి అవకాశం

రాజీ పద్ధతిలో సత్వర న్యాయ పరిష్కారానికి అవకాశం

నిజామాబాద్‌ లీగల్‌ : దీర్ఘకాలిక న్యాయ వివాదాల పరిష్కారానికి జాతీయ లోక్‌ అదాలత్‌ చక్కని పరిష్కార మార్గమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ జీవీఎన్‌ భరతలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో అదనపు జిల్లా జడ్జి కనకదుర్గ, తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు మంథని రాజేందర్‌ రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మామిళ్ళ సాయిరెడ్డి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్‌ రావు, అదనపు జిల్లా పోలీసు కమిషనర్‌ బస్వారెడ్డితో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ కోర్టుల్లో కేసులతో కక్షిదారులు విలువైన జీవితకాలాన్ని కోల్పోతారని, లోక్‌ అదాలత్‌ల ద్వార రాజీ పద్ధతిలో కేసులను పరిష్కరించుకుంటే సత్వర న్యాయానికి అవకాశముందని ఆమె అన్నారు. లోక్‌ అదాలత్‌లలో కేసులను పరిష్కరించుకోవాలని కక్షిదారులను బలవంతం చేయరాదని, ఇష్టపూర్వకంగా రాజీకి మాత్రమే ప్రయత్నించాలని జడ్జి కోరారు. అదనపు జిల్లా జడ్జి కనకదుర్గ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలని, వినాశానికి కాదని అన్నారు. నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాయిరెడ్డి మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌కు బార్‌ అసోసియేషన్‌ అండ గా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో జడ్జి హరీష, సీనియర్‌ సివిల్‌ జడ్జి సాయిసుధ, జూనియర్‌ సివిల్‌ జడ్జీలు గోపికృష్ణ, ఖుష్బు ఉపాధ్యాయి, శ్రీనివాస్‌ రావు, హరి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ కోర్టుల్లో ఏర్పాటు చేసిన 18 బెంచ్‌ల ద్వార సివిల్‌, క్రిమినల్‌, బీమా కేసులకు సంబంధించి 29,725 కేసులను పరిష్కరించారు. కక్షిదారులకు 18 కోట్ల 36 లక్షల 61 వేల 156 రూ పాయల పరిహారం అందజేసినట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్‌ శైలజ తెలి పారు. ఈ సందర్భంగా చోళ మండలం ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వార జెన్‌కో ఉద్యోగి ప్రేమ్‌దాస్‌ కుటుంబానికి రూ. 90 లక్షల పరిహారం చెల్లించారు.

జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్‌ పర్సన్‌ భరత లక్ష్మి

జాతీయ లోక్‌ అదాలత్‌లో

29,725 కేసుల పరిష్కారం

రూ. 18 కోట్ల 36 లక్షలకు పైగా

పరిహారం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement