
కట్టుబాట్లను కాదని కూతుళ్లకు వేద బాట
మోర్తాడ్ (బాల్కొండ): మారుతున్న నాగరికతకు అనుగుణంగా సమాజంలో మార్పు తీసుకువచ్చే శక్తి ఆడవారికి ఉందని అందరికీ తెలిసేలా చేశారు చౌట్పల్లికి చెందిన కాశీరాం జోషి(హన్మాండ్ల పంతులు). వేద పఠనం, ఉపనిషత్తులు నేర్చుకోవడం, పౌరోహిత్యం మగవారికే పరిమితం అని గట్టిగా వాదించిన వారు ముక్కున వేలువేసుకునేలా చేశారు. తన పౌరోహిత్య వారసత్వాన్ని అందుకునే కొడుకులు లేరని బాధపడకుండా తన నలుగురు కూతుళ్లు ప్రణవేశ్వరి, రాజేశ్వరి, భువనేశ్వరి, జ్ఞానేశ్వరికి చిన్నతనం నుంచే వేదాలు, ఉపనిషత్తులు నేర్పించారు. ఆడవారికి ఉపనయం ఏమిటని అప్పట్లో ఎంతో మంది ప్రశ్నించినా ఎవరినీ లెక్క చేయకుండా సికింద్రాబాద్లోని ఆర్య సమాజ్ నిర్వాహకుడు పండిత్ నరేంద్రజీని చౌట్పల్లికి ఆహ్వానించి ఆయనతో
1972లో తన కూతుళ్లకు ఉపనయనం చేయించారు. ఆ రోజు కాశీరాం జోషి ఒక తండ్రిగా తన కూతుళ్లకు చూపిన వేద బాటను ఇప్పుడు ఎంతో మంది ఆచరిస్తున్నారు. 2022లో కాశీరాంజోషి శివైక్యం అయ్యారు. తమ తండ్రి చూపిన బాటను వృత్తిగా కాకుండా ధర్మంగా భావిస్తున్నామని ఆ నలుగురు అక్కాచెల్లెళ్లు అంటున్నారు.