
వెంటాడుతున్న సమస్యలు
బోధన్: నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు గతంతో పోలిస్తే కొంత మెరుగైనప్పటికీ.. తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత, కనీస మౌలిక సౌకర్యాలు తదితర సమస్యలు వెంటాడుతున్నాయి.
● సాలూర మండలం హున్సా మండల పరిషత్ ఉన్నత పాఠశాల శిథిలావస్థలో ఉన్న భవనంలో కొనసాగుతోంది. తరగతి గదులు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఉందని టీచర్లు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గ్రామ శివారులో నూతన భవన నిర్మాణ పనులు పునాది దశలో రెండేళ్ల క్రితమే ఆగిపోయాయి. ఖాజాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఎండాకాలంలో ప్రారంభించిన మరుగుదొడ్డి నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ పాఠశాలలో ఏడు తరగతులకుగాను నాలుగు గదులున్నాయి. ఆఫీస్ గదిలో తరగతులు నిర్వహిస్తున్నారు.
● బోధన్ పట్టణంలోని అంబేడ్కర్నగర్ ప్రాథమిక పాఠశాల భవనం గదులు బీటల వారి కూలిపోయే దశకు చేరడంతో గత విద్యాసంవత్సరంలోనే సమీపంలోని ద్యాకంగల్లీ ప్రాథమికోన్నత పాఠశాలకు విద్యార్థులను షిప్ట్ చేశారు. తట్టికోట కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లే దారి ఎత్తు ప్రదేశంలో ఉండటంతో ప్రమాదకరంగా ఉంది. ఈ పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులు సగంలో నిలిచిపోయాయి.
● రెంజల్ మండలంలోని దూపల్లి ప్రాథమిక పాఠశాలలో రెండేళ్ల క్రితం రూ.40 లక్షలతో చేపట్టిన నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు అర్ధంతంగా నిలిచిపోయాయి.

వెంటాడుతున్న సమస్యలు