
అమ్మమాట– అంగన్వాడీ బాట
కమ్మర్పల్లి: అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు, చిన్నారుల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈనెల 10 నుంచి 17 వరకు ’అమ్మమాట.. అంగన్వాడీ బాట’ పేరుతో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది. స్పెషల్ అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించి అర్హత గల పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. ఈమేరకు సిబ్బందికి ఆదేశాలు సైతం జారీ చేసింది.
ఒక్కో రోజూ..
అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ సిబ్బంది కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కోసం కొనసాగుతున్న బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులతో కలిసి అంగన్వాడీలు, సిబ్బంది విద్యార్థుల నమోదు కోసం ఇప్పటికే ఇంటింటికి తిరుగుతున్నారు. ఈక్రమంలో అంగన్వాడీల్లోనూ ప్రవేశాల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.
● 10న అంగన్వాడీలను అందంగా అలంకరించాలి. చిన్నారులను, వారి తల్లిదండ్రులను కేంద్రాలకు ఆహ్వానించి సెల్ఫీలు తీసుకోవాలి, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించాలి.
● 11న గ్రామాల్లో మూడేళ్లలోపు పిల్లలను గుర్తించాలి. వారిని అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా పిల్లల తల్లిదండ్రులకు వివరించాలి. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను వివరించి ఆ సేవలు పొందేలా వారిని ప్రోత్సహించాలి. అంగన్వాడీ కేంద్రంలో చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలి. అయిదేళ్లు దాటిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించాలి.
● 12,13,16 తేదీల్లో.. అంగన్వాడీ కేంద్రాల ఆవరణల్లో ‘పోషణ వాటిక’ (కిచెన్ గార్డెన్లు) అభివృద్ధి చేయాలి. పోషకాహారం గురించి ప్రజలకు వివరించాలి. అంగన్వాడీ కేంద్రాల్లో చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించి, పరిసరాల్లో మొక్కలు నాటాలి. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులను ఆకట్టుకునేలా తగిన వాతావరణాన్ని కల్పించాలి.
● 17న చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలి. అలాగే పాఠాలు, టైం టేబుల్, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలి. స్టడీ మెటీరియల్ అందించాలి.
అంగన్వాడీల్లో అడ్మిషన్ల సంఖ్య
పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ
ఈనెల 10 నుంచి 17 వరకు
వివిధ కార్యక్రమాల నిర్వహణ
అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థుల నమోదు కోసం ఈనెల 10నుంచి 17 వరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకున్న తరుణంలో ఉపాధ్యాయులు, సిబ్బంది బడిబాట కార్యక్రమంలో పాల్గొంటూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.
–ఐ స్వర్ణలత, సీడీపీవో, భీమ్గల్

అమ్మమాట– అంగన్వాడీ బాట