
మరమ్మతులు చేయరు.. వినియోగించరు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కార్యాలయ భవనా లు ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉంటున్నాయి. ఆ భవనాలకు మరమ్మతులు లేకపోవడం, ఉపయోగించకపోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర ప్రాంతాలకు తరలింపు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఏటా ఒక సబ్ డివిజన్ ఇతర ప్రాంతాలకు తరలిపోయింది. అంతేకాకుండ ముంపు గ్రామాల సమస్యల కోసం స్పెషల్ కలెక్టర్ కార్యాలయం కూడ నిర్మించారు. ప్రస్తుతం స్పెషల్ కలెక్టర్ వ్యవస్థనే ఇక్కడ లేకుండా చేశారు. ప్రాణహిత చెవెళ్ల నిర్మాణం కోసం సబ్ డివిజన్– 4 నిజామాబాద్, క్వాలిటీ కంట్రోల్ విభాగం నిర్మల్కు, లక్ష్మి కాలువ నిర్వహణ కార్యాలయం బాల్కొండకు, సరస్వతి కాలువ నిర్వహణ కార్యాలయం నిర్మల్కు తరలిపోయాయి. దీంతో ప్రాజెక్ట్ వద్ద ఉన్న కార్యాలయ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. బహుళ అంతస్తుల భవనాలు కూడ నిరుపయోగంగా ఉన్నాయి.
విద్యాసంస్థలకు కేటాయిస్తే మేలు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద బాలికల, బాలుర గురుకులాలు, తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో బాలుర, బాలికల గురుకులాలను ఆరేళ్ల క్రితం అప్గ్రేడ్ చేస్తు ఇంటర్మీడియట్ ఏర్పాటు చేశారు. కానీ భవనాలను నిర్మించలేదు. ఇరుకు గదుల్లో, చెట్ల కింద చదువులు నేర్పుతున్నారు. ఆ గురుకులాల కళాశాలల కోసం నిరుపయోగంగా ఉన్న భవనాలను కేటాయించవచ్చు. కానీ అటువైపుగా ఎవరు ఆలోచన చేయడం లేదు. పక్కా భవనాలు కావడంతో కొంతమేర మరమ్మతులు చేపడితే వినియోగించుకోవచ్చు. కానీ వాటిని వినియోగంలోకి తీసుకురావాడానికి పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కనీసం విద్యా సంస్థల నిర్వహణ కోసం ఈ కార్యాలయాల భవనాలను ఉపయోగంలోకి తీసుకురావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఏళ్లుగా ఖాళీగా ఉంటున్న
ఎస్సారెస్పీ కార్యాలయ భవనాలు
శిథిలావస్థకు చేరినా పట్టించుకోని
అధికారులు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..
ప్రాజెక్ట్ కార్యాలయాల భవనాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఇతర సంస్థలకు అప్పగించే విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వాటి నిర్వహణకు కూడ ఎలాంటి నిధులు రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
– చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ
సమీకృత పాఠశాల ఏర్పాటు చేయాలి
ఎస్సారెస్పీలో నిరుపయోగంగా ఉన్న కార్యాలయాల్లో సమీకృత పాఠశాలను ఏర్పాటు చేయాలి. విద్యా సంస్థలకు ఆ భవనాలను కేటాయిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పాలకులు వెంటనే స్పందించాలి.
– నర్సింగ్రావు, రిటైర్డ్ పీడీ