
పట్టణాభివృద్ధిపై ఫోకస్
● ప్రత్యేక అధికారి సమీక్ష ● అభివృద్ధికి సమష్టి కృషికి ఆదేశం
నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ ప్రత్యేక అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్యం, పన్నుల వసూలు, మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లు, పట్టణ సుందరీకరణ తదితర అంశాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అన్ని అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వాణిజ్య, వ్యాపార, ప్రకటనల అద్దె, పన్నులు అన్నింటినీ సకాలంలో వసూలు చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నీటి సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పట్టణంలో కీలకమైన కూడళ్లలో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.