
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ ఆదేశించారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ.గౌతమ్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. రెండోదశ ఇళ్లకు సంబంధించిన మార్కింగ్, గ్రౌండింగ్ పనులు నిత్యం పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరైన స్థలాల్లో నిర్మాణం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్) లబ్ధిదారుల ఓటీపీ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని, ఇందుకోసం వార్డుస్థాయి అధికారులకు నియోజకవర్గాలవారీగా శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రాజేశ్వర్, గృహనిర్మాణ, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.