
రైతులకు తీపికబురు
● నేటి నుంచి ఖాతాల్లో ‘రైతు భరోసా’ ● జిల్లాలో 1.50 లక్షల మందికి లబ్ధి ● సుమారు రూ.228 కోట్లు చెల్లించే అవకాశం
లక్ష్మణచాంద: తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ఖరీఫ్ సాగు పనులు ఇప్పుడిప్పు డే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఎకరాకు ఏడాదికి రూ.12 వేల చొప్పున రెండు విడతల్లో రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ వానాకాలం సీజన్కు ఎకరాకు రూ.6 వేల చొప్పున మంగళవారం నుంచి రైతుల ఖాతా ల్లో పెట్టుబడి సాయం జమ చేయనుంది. జిల్లాలోని 1.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
రైతులకు సంక్షేమ పథకాలు
రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. 24 గంటలు నా ణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరాతోపాటు, రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ రైతులను ఆదుకుంటోంది. ఈ పథకాలు రైతులకు పంటల సాగులో గణనీయమైన మద్దతు అందిస్తున్నాయి.
అర్హుల వివరాలు సమర్పణ
జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, వానాకాలం సీజన్కు రైతు భరో సా పథకానికి అర్హులైన 1.5 లక్షల మంది రైతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే పంపినట్లు తెలిపారు. జిల్లాలోని 19 మండలాల పరిధిలో ఈ రైతులను గుర్తించామని పేర్కొన్నారు.
రూ.228 కోట్లు జమ
రైతు భరోసా పథకం కింద జిల్లాలోని 1.5 లక్షల మంది రైతులకు రూ.228 కోట్లు జమ కానున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్ తెలిపారు. రైతులు వ్యవసాయ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు.