
బిల్లుల కోసం బడికి తాళం
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ ఎస్ఎంసీ చైర్మన్, కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ సోమవారం ఆందోళనకు దిగారు. ఉదయం పాఠశాల ప్రారంభానికి ముందే తాళం వేసి, పెట్రోల్ డబ్బాతో పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపాడు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరుబయటే ఉండాల్సి వచ్చింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పెంబి ఎస్సై అజయ్, ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించాడు.
రూ.23 లక్షల బిల్లులు పెండింగ్
కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘మన ఊరు–మన బడి’, ఎన్ఆర్ఈజీఎస్ పథకాల కింద రూ.40 లక్షల నిధులతో పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, కిచెన్ షెడ్, ఇతర మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపాడు. ఈ పనులకు రూ.17 లక్షల బిల్లులు మాత్రమే చెల్లించారని, రూ.23 లక్షలు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నాడు. గతంలో కలెక్టర్తోసహా సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
అప్పుల భారంతో ఆర్థిక ఇబ్బందులు
పనుల కోసం తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు ఇంట్లోని బంగారం, పశువులు, ఇతర ఆస్తులు విక్రయించినా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని కాంట్రాక్టర్ వాపోయాడు. అనంతరం కలెక్టరేట్కు వెళ్లి ప్రజావాణిలో కలెక్టర్ అభిలాష అభినవ్ను కలిసి మరోసారి వినతిపత్రం అందించాడు.