ఏడాదిలో ఎన్నో.. చేయాల్సినవి మరెన్నో.. | - | Sakshi
Sakshi News home page

ఏడాదిలో ఎన్నో.. చేయాల్సినవి మరెన్నో..

Jun 16 2025 7:03 AM | Updated on Jun 16 2025 7:03 AM

ఏడాదిలో ఎన్నో.. చేయాల్సినవి మరెన్నో..

ఏడాదిలో ఎన్నో.. చేయాల్సినవి మరెన్నో..

నిర్మల్‌: జిల్లా ఆరో కలెక్టర్‌గా అభిలాషఅభినవ్‌ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాదవుతోంది. కలెక్టర్‌గా తొలిపోస్టింగ్‌ జిల్లాలోనే తీసుకున్న ఆమె ఎన్నో పనులను విజయవంతంగా పూర్తిచేశారు. జిల్లాచరిత్రలో తొలిసారి ‘నిర్మల్‌ ఉత్సవాలు’ ని ర్వహించి ఓ ట్రెండ్‌ సెట్‌ చేశారు. బాలశక్తి లాంటి వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రస్థాయిలో జిల్లాపేరును నిలబెట్టారు. పాలనాపరంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా ఎన్నో పనులు చేపట్టినా.. కలెక్టర్‌గా మరెన్నో జిల్లావాసుల ఆశలు పూర్తిచేయాల్సి ఉంది.

పాలనలో తన ముద్ర

సీరియస్‌ అధికారిగా పేరొందిన ఆశిష్‌సంగ్వాన్‌ తర్వాత కలెక్టర్‌గా నియమితులైన అభిలాష అ భినవ్‌ ఎలా ఉంటారోనన్న ఆతృత జిల్లా అధి కారులతో సహ ప్రజల్లోనూ ఉండేది. తాను క్ర మంగా జిల్లాపై పట్టు పెంచుకుంటూ వివిధ రంగాల్లో ప్రగతికి పునాది వేశారు. బాలశక్తి నుంచి భూముల రక్షణ వరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, సంక్షేమ పథకాల అమలులో విశేష కృషి చేశారు.

చేసినవాటిలో కొన్ని..

● అంగన్‌వాడీల నుంచి ఉన్నతపాఠశాలల వర కు సదుపాయాలు మెరుగుపరచడంతో పా టు.. హాస్టళ్లలో రాత్రిపూట ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో కలెక్టర్‌ రాత్రి బస చేస్తూ.. వారి సమస్యలు తెలుసుకున్నారు.

● వైద్యరంగంలో పలు ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేశారు. ఖానాపూర్‌ ఆస్పత్రిలో కొత్తగా ఆర్థో విభాగం ఏర్పాటైంది. జిల్లా ఆస్పత్రిలో డాక్టర్ల నియామకంతో ప్రసవాల సంఖ్య పెరిగింది.

● కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌ స్వయంగా ప్రారంభించిన బాలశక్తి కార్యక్రమానికి రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కింది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి 2024 సెప్టెంబర్‌ 20న ‘బాలశక్తి’ ప్రారంభించారు. 19వేల మంది విద్యార్థులకు హెల్త్‌ స్క్రీనింగ్‌, 1,274 మందికి కంటి అద్దాలు అందించారు.

● ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో ఆక్రమించిన ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. భైంసా, నర్సాపూర్‌(జి), లోకేశ్వరం మండలాల్లో రూ.కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకున్నారు.

● నిర్మల్‌ ఉత్సవాల పేరిట జిల్లాచరిత్రను ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం ప్రారంభించారు. జిల్లా చరిత్ర, సాంస్కృతిక వైభవాన్ని ఈ ఉత్సవాల్లో చాటారు.

● పథకాల అమలులో పారదర్శకత పాటించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, భూముల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు, ధాన్యం కొనుగోళ్లలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు.

● ప్రజల ఫిర్యాదులకు స్పందిస్తూ ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఫోన్‌ద్వారా కూడా ప్రజల సమస్యలను తెలుసుకునే విధానాన్ని ప్రారంభించారు.

● మహిళా సంఘాలకు క్యాంటీన్లు, రుణ వితరణతోపాటు త్వరలో పెట్రోల్‌ బంక్‌ల నిర్వహణకు అవకాశమిస్తుండగా.. మైత్రి క్లినిక్‌, డ్రగ్‌ డీ అడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. మహిళా శక్తి భవనం త్వరలో ప్రారంభం కానుంది.

సమష్టిగా ముందుకు..

ఏడాదికాలం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశాను. మున్ముందు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమష్టి సహకారంతో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తాను.

– అభిలాషఅభినవ్‌, కలెక్టర్‌

చేయాల్సినవెన్నో..

● ప్రధానంగా జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఇథనాల్‌ పరిశ్రమ వివాదాస్పదమైంది. ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ కూడా అలాగే తయారైంది. పారిశ్రామిక ప్రగతికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.

● కాళేశ్వరం పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన 27వ ప్యాకేజీని ప్రారంభించినా.. ఇప్పటికీ నీటిని ఎత్తిపోయడం లేదు. 28వ ప్యాకేజీ పనులే పూర్తి కాలేదు.

● జిల్లా వరుసగా రెండుసార్లు పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆ స్థానం దిగజారింది. మళ్లీ ప్రథమ స్థానానికి ప్రణాళికలు వేయాలి.

● ప్రధానంగా పర్యాటకంగా జిల్లాలో అభివృద్ధి శూన్యం. చేసేందుకు చాలా అవకాశాలున్నాయి. వాటిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

● జిల్లాకేంద్రంలో కబ్జాలు కామన్‌గా మారాయి. ట్రాఫిక్‌ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. మున్సిపల్‌లో చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

అభిలాషపై ఇప్పటికీ జిల్లా ఆశలు

కలెక్టర్‌గా నియమితులై నేటికి ఏడాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement