
తల్లిదండ్రులకు అక్షరాలు నేర్పాలి
● డీఈవో రామారావు
నిర్మల్ రూరల్: విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని డీఈవో రామారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వయోజన విద్యపై మండల స్థాయి సిబ్బందికి శుక్రవారం ఇచ్చిన శిక్షణ శిబిరంలో మాట్లాడారు. మొదట గ్రామ, మండల , జిల్లా స్థాయిలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. శిక్షణకు హాజరైన మండల విద్యాధికారులు, సెర్ప్ సిబ్బంది సీఆర్పీలు, ఐఆర్పీలు అందరూ సమన్వయంతో, స్వయం సహాయక బృందాల ద్వారా జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించాలన్నారు. శిక్షకులను నియమించి అక్షరాస్యులుగా చేయాలన్నారు. డీఆర్డీవో ఇన్చార్జి పీడీ నాగవర్ధన్, మెప్మా పీడీ సుభాష్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, వయోజన విద్య కోఆర్డినేటర్ తిరుపతిరావు, డీపీఎం సాయిప్రసాద్, నర్సయ్య, ప్రవీణ్కుమార్, ఎంఈవోలు, ఏపీఎం, సీసీలు, సీఆర్పీలు ఐఆర్పీలు పాల్గొన్నారు.
ప్రవేశాలు పెంచాలి..
నిర్మల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలని డీఈవో రామారావు సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మంజులాపూర్ ప్రైమరీ పాఠశాలను పరిశీలించారు. నూతనంగా నమోదైన విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, ఉపాధ్యాయుల విద్యార్హతలను తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. అనంతరం ఆయా తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ పరమేశ్వర్, ఎస్వో రాజేశ్వర్, హెచ్ఎం కవితారాణి, ఉపాధ్యాయులు సుధీర్, ఉమామహేశ్వర్రెడ్డి, కావ్య తదితరులు పాల్గొన్నారు.