Video: వందే భారత్‌ రైలులో సాంకేతిక లోపం.. లాక్కెళ్లిన మరో ఇంజిన్‌ | Video: Vande Bharat Train Towed By Another Engine After Facing Technical Glitch | Sakshi
Sakshi News home page

Video: వందే భారత్‌ రైలులో సాంకేతిక లోపం.. లాక్కెళ్లిన మరో ఇంజిన్‌

Sep 9 2024 7:29 PM | Updated on Sep 9 2024 8:33 PM

Video: Vande Bharat Train Towed By Another Engine After Facing Technical Glitch

లక్నో: భారత రైల్వే తీసుకొచ్చిన సెమీ స్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. అంతే స్పీడ్‌తో పలు రూట్‌లలో పరుగులు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఈ రైళ్లపై అంతే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి . గతంలో ఎన్నోసార్లు రైళ్లపై రాళ్లు రువ్వడం, గేదేలు వంటివి ఢీకొని రైళ్లు ధ్వంసమైన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.

తాజాగా ఓక వందే భారత్‌ రైలు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గ మధ్యలో ఆగిన ఆ రైలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. చివరకు మరో రైలు ఇంజిన్‌ ద్వారా వందే భారత్‌ రైలును సమీపంలోని స్టేషన్‌ వరకు లాక్కెళ్లారు. ఈ ఘటన న్యూఢిల్లీ- వారణాసి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. 

రైలు ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో  సోమవారం ఉదయం 9.15 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌ ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో అది ఆగిపోయింది. సమాచారం రైల్వే టెక్నికల్‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని వందే భారత్‌ రైలు ఇంజిన్‌లోని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చివరకు మూడు గంటల తర్వాత మరో రైలు ఇంజిన్‌ను రప్పించారు. దాని ద్వారా వందే భారత్‌ రైలును భర్తానా రైల్వే స్టేషన్‌ వరకు లాక్కెళ్లారు.

మరోవైపు ఈ సంఘటన వల్ల వందే భారత్‌ ట్రైన్‌లోని ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపార్ట్‌మెంట్స్‌లోని ఏసీలు పని చేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. చివరకు వందే భారత్‌ ట్రైన్‌లోని సుమారు 750 మంది ప్రయాణికులను ఇతర రైళ్లలో వారి గమ్యస్థానాలకు చేర్చారు. కాగా, వందే భారత్‌ ట్రైన్‌ను మరో రైలు ఇంజిన్‌ ద్వారా లాక్కెళ్లిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వేతోపాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement