టెలిగ్రామ్ వాడుతున్నారా?.. కేంద్రం చెప్పింది వింటే షాక్ అవుతారు! | Telegram being used for carrying out cyberattacks Government | Sakshi
Sakshi News home page

టెలిగ్రామ్ వాడుతున్నారా?.. కేంద్రం చెప్పింది వింటే షాక్ అవుతారు!

Jun 18 2026 4:13 PM | Updated on Jun 18 2026 6:36 PM

Telegram being used for carrying out cyberattacks Government

న్యూఢిల్లీ: టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ ద్వారా ఈ విషయాలు తెలిశాయి. టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసులో ఈ అఫిడవిట్ దాఖలైంది. పరీక్షా ప్రశ్నపత్రాల లీకులను అడ్డుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత, ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని టెలిగ్రామ్ కోర్టును ఆశ్రయించింది.

ఆ కేసులో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఈ అఫిడవిట్ సమర్పించింది. టెలిగ్రామ్‌ను ఎందుకు ప్రమాదకర వేదికగా భావిస్తున్నామో వివరించేందుకు ఈ ఆరోపణలను అఫిడవిట్‌లో పొందుపరిచింది. ఇందులో పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన దృశ్యాల ప్రచారం, సైబర్ మోసాలు, ఉగ్రవాద ప్రచారం, పరీక్షా ప్రశ్నపత్రాల లీకులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అంశాలను ప్రస్తావించింది.

"కొత్త డార్క్ వెబ్"గా మారింది.. 
టెలిగ్రామ్ "కొత్త డార్క్ వెబ్"గా మారిందని, నేరగాళ్లు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద సంస్థలు, ఇతర ముప్పు కలిగించే వర్గాలు చట్ట అమలు సంస్థల నిఘా నుంచి తప్పించుకోవడానికి దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నాయని పేర్కొంది.

లీకైన ప్రశ్నపత్రాలను పంపడం, సైబర్ మోసాలు, ఉగ్రవాద ప్రచారం, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన దృశ్యాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలు సహా విస్తృత స్థాయిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ ప్రధాన వేదికగా మారిందని కేంద్రం ఆరోపించింది.

"టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్‌గా మారి, ముప్పు కలిగించే వర్గాలను ఒకచోటకు చేర్చుతోంది. నేరగాళ్లు టెలిగ్రామ్ ఛానళ్లలో డీప్ వెబ్ లింకులను పంచుతూ, డార్క్ వెబ్ ఫోరమ్‌లకు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల నేరగాళ్లను గుర్తించడం, వారి ఆచూకీ కనుగొనడం అధికారులకు కష్టమవుతోంది" అని కేంద్రం తెలిపింది.

అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. టెలిగ్రామ్‌లోని గోప్యత, అజ్ఞాతంగా ఉండే సౌకర్యాలు నేర ముఠాలకు బాగా ఉపయోగపడుతున్నాయి. గోప్యత సెట్టింగ్‌ల ద్వారా ఫోన్ నంబర్లు, టెలిగ్రామ్ గుర్తింపు వివరాలు వంటి సమాచారాన్ని వినియోగదారులు దాచిపెట్టగలుగుతున్నారని, దీనివల్ల ఖాతాల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించడం దర్యాప్తు సంస్థలకు కష్టమవుతోందని కేంద్రం తెలిపింది.

"మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, తీవ్రవాదం, ఉగ్రవాదం, పిల్లల దోపిడీ, సైబర్ మోసాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ వినియోగం పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం గోప్యత సౌకర్యాలే" అని అఫిడవిట్‌లో పేర్కొంది.

తీవ్రవాద సంస్థలకు చెందిన ప్రచార సామగ్రి, హింసను ప్రోత్సహించే విషయాల ప్రసారానికి కూడా టెలిగ్రామ్ గ్రూపులు, ఛానళ్లు వినియోగంలో ఉన్నాయని కేంద్రం ఆరోపించింది.

"ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వర్గాలు టెలిగ్రామ్ గ్రూపులు, ఛానళ్ల ద్వారా హింసాత్మక తీవ్రవాద చర్యలు, ఇతర తీవ్ర భావజాల ప్రచారాన్ని వ‍్యాప్తి చేస్తున్నాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ప్రజా శాంతికి భంగం కలిగించడం వీటి లక్ష్యం" అని అఫిడవిట్‌లో తెలిపింది.

పిల్లలపై లైంగిక దోపిడీ దృశ్యాల ప్రసారం 
అత్యంత తీవ్రమైన ఆరోపణల్లో ఒకటిగా.. పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన దృశ్యాల ప్రసారం టెలిగ్రామ్ గ్రూపులు, ఛానళ్ల ద్వారా జరుగుతోందని కేంద్రం పేర్కొంది. సైబర్ నేరాలకు టెలిగ్రామ్ ప్రధాన కేంద్రంగా మారిందని కూడా అఫిడవిట్‌లో కేంద్రం ఆరోపించింది. తప్పుడు గుర్తింపు వివరాలతో నకిలీ ఖాతాలు సృష్టించి ఆర్థిక మోసాలు చేయడం, డేటా లీకులు ప్రచారం చేయడం, సైబర్ నేరాలను సమన్వయం చేయడం వంటివి జరుగుతున్నాయని తెలిపింది. జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదుల పోర్టల్ గణాంకాలను ప్రస్తావిస్తూ, సైబర్ మోసాలకు టెలిగ్రామ్ వినియోగంపై ఫిర్యాదులు బాగా పెరిగాయని కేంద్రం తెలిపింది.

సైబర్ నేరాలు, అక్రమ నగదు చలామణి ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించడానికి, బదిలీ చేయడానికి వినియోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాల కొనుగోలు, అమ్మకాలకూ టెలిగ్రామ్ ఛానళ్లు వినియోగంలో ఉన్నాయని కేంద్రం ఆరోపించింది. ఒక సందర్భంలో.. హానికర ఏపీకే దస్త్రాలు భద్రతా వ్యవస్థలకు గుర్తుపట్టకుండా కనిపించేలా చేసే సాధనాలను ఒక టెలిగ్రామ్ ఛానల్ ప్రచారం చేసిందని కేంద్రం తెలిపింది. మరో ఛానల్‌లో ఆర్థిక, చెల్లింపు సేవల పేర్లతో కనిపించే హానికర సాఫ్ట్‌వేర్ ప్రచారం జరిగిందని ఆరోపించింది.

ఇప్పటికే లీకైన సమాచార నిల్వల నుంచి సేకరించిన మొబైల్ నంబర్లు, ఆధార్ వివరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని పౌరులకు అందించేలా టెలిగ్రామ్ బాట్లు పనిచేస్తున్నాయన్న ఆందోళనను కూడా అఫిడవిట్‌లో వ్యక్తం చేసింది.

సైబర్ నేరాలే కాకుండా, పైరసీ చేసిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కాపీరైట్ ఉన్న విషయాల ప్రసారానికి కూడా టెలిగ్రామ్ ఛానళ్లు విస్తృతంగా వినియోగంలో ఉన్నాయని కేంద్రం ఆరోపించింది. దీనివల్ల కంటెంట్ క్రియేటర్లకు నష్టం కలుగుతోందని, మేధోసంపత్తి హక్కులపై ఆందోళనలు పెరుగుతున్నాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement