రాంచీ: పరీక్షార్థుల ఉద్యమధాటికి 45 పరీక్షలను జార్ఖండ్ ప్రభుత్వం రద్దు చేస్తూ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీచేయడంతో గత పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకిస్తూ ఆందోళనలను ఉధృతంచేశారు. బుధవారం వందలాది మంది అభ్యర్థులు రాంచీలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి తమ సమస్యల్ని వివరిస్తామంటూ అభ్యర్థులు సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు. దీంతో వీళ్లను ప్రధాన కార్యాలయం లోపలి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన అభ్యర్థులు వాళ్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో తోపులాట జరిగింది.
ప్రాంగణంలోకి రాకుండా అక్కడ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాసరే వాటిని లెక్కచేయకుండా పోలీసులను తోసుకుంటూ అభ్యర్థులు సెక్రటేరియట్ ప్రాంగణంలోకి వెళ్లి బైఠాయించారు. పరీక్షల్లో అక్రమాల కోణంలో దర్యాప్తు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, మొత్తం పరీక్షల రద్దు అంటే తమ ఉద్యోగభవిష్యత్తు అంధకారంలో పడుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకునే దురుద్దేశం మాకు లేదు. శాంతియుతంగా ధర్నాలుచేసేందుకు మాకు ఒకటి, రెండు ధర్నాస్థలిలను ప్రభుత్వం సూచించింది. అక్కడ నిరసనలు ఆగవు. పరీక్షల్ని రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ఇచి్చన నోటిఫికేషన్ను ఉపసంహరించుకునేదాకా మా ఆందోళనలు కొనసాగుతాయి’’అని అభ్యర్థుల నేత, ఇటీవల అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం పొందిన చందన్ కుమార్ స్పష్టంచేశారు.
హైకోర్టులో పలువురి పిటిషన్లు..
పరీక్షల్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్చేస్తూ పలువురు అభ్యర్థులు బుధవారం జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ‘‘పరీక్షల్ని రద్దుచేస్తే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారు. కుటుంబాలు వీధిన పడతాయి. అభ్యర్థుల భవిష్యత్ నాశనమవుతుంది. ప్రస్తుతం ఉద్యోగాలు చేసుకుంటున్న అభ్యర్థులకు ఉపశమనం కల్పించేలా తగు ఆదేశాలు ఇవ్వండి. ప్రభుత్వ నిర్ణయం అమలుకాకుండా నిలువరించండి’’అని అద్వేష్ కుమార్ తదితరులు పిటిషన్లు దాఖలుచేశారు.


