Bihar Election: ఎన్‌డీఏ, మహాకూటమిపై పీకే సంచలన వ్యాఖ్యలు | Prashant Kishor Predicts Bihar Polls Fight Between NDA and Jan Suraaj, Says Mahagathbandhan Will Finish Third | Sakshi
Sakshi News home page

Bihar Election: ఎన్‌డీఏ, మహాకూటమిపై పీకే సంచలన వ్యాఖ్యలు

Oct 27 2025 12:53 PM | Updated on Oct 27 2025 1:32 PM

Real contest is nda vs Jan suraaj Prashant Kishor claims

పట్నా: బీహార్‌లో ఎన్నికల వేడి నెలకొంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయ సందడి చేస్తున్నాయి. తాజాగా జన్‌  సురాజ్‌ చీఫ్‌ ‍ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) ఎన్‌డీఏ, మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్‌డీఏ, తమ ‘జన్‌ సురాజ్‌’ పార్టీల మధ్యనే ఉంటుందని, మహాకూటమి ఓటమిపాలై, మూడో స్థానంలో నిలుస్తుందని జోస్యం చెప్పారు.

ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త, జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ సోమవారం విలేకరులతో  మాట్లాడుతూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌(మహాకూటమి) రాబోయే ఎన్నికల్లో ఓటమిపాలై మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. తాము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని సందర్శిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో మహాకూటమి మూడవ స్థానంలో ఉందన్నారు.  ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్‌డీఏ, జన్ సురాజ్ మధ్యనే ఉంటుందన్నారు. గత  ఐదు రోజుల్లో తేజస్వి యాదవ్ చేసిన ప్రకటనల్లో అస్సలు అర్థం లేదని, వీటిపై ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు.

దీనికి ముందు మధుబనిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రశాంత్‌ కిశోర్‌ మాట్లాడుతూ బీహార్ ఓటర్లు నితీష్ కుమార్, బీజేపీ, లాలు యాదవ్‌ల ఆధిపత్య పార్టీల రాజకీయాలను దాటి వెళుతున్నారని అన్నారు. రాష్ట్ర యువతపై తటస్థ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటున్నదన్నారు. బీహార్‌లో కొత్త రాజకీయ చరిత్రను అంతా చూస్తారని.. లాలు, నితీష్,బీజేపీలకు భయపడి ఓటు వేసిన 30 ఏళ్ల యుగం ముగియబోతున్నదన్నారు. కొత్త ప్రత్యామ్నాయం ఉద్భవిస్తోందని,  దాని నేత.. ఏ నాయకుడు, కుటుంబం లేదా కులానికి చెందినవాడు కాదని,  బీహార్‌కు చెందినవాడేనని అన్నారు. జన్ సురాజ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, జీవనోపాధి కోసం ఎవరూ రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదని కిషోర్ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement