ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి రాజ్కుమార్ గోయల్ను కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక ప్యానెల్ బుధవారం సమావేశమై గోయల్ పేరును సీఐసీ పదవికి సిఫార్సుచేసినట్లు శనివారం ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. సీఐసీగా గోయల్తోపాటు మరో ఎనిమిది మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్(ఐసీ)లను కొత్తగా ప్యానెల్ సిఫార్సుచేసింది.
గోయల్ చేత సీఐసీగా సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయిస్తారు. అరుణాచల్ ప్రదేశ్–గోవా–మిజోరం–యూనియన్ టెరిటరీస్(ఏజీఎంయూటీ) క్యాడర్కు చెందిన 1990 బ్యాచ్(రిటైర్డ్) ఐఏఎస్ అధికారి అయిన గోయల్ ఇటీవల కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిగా సేవలందించారు. గతంలో ఈయన కేంద్ర హోం శాఖలో సరిహద్దు నిర్వహణ విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. అవిభాజ్య జమ్మూకశీ్మర్ రాష్ట్రంతోపాటు కేంద్రప్రభుత్వంలో పలు పదవుల్లో సేవలందించారు.
సెపె్టంబర్ 13వ తేదీన ప్రస్తుత సీఐసీ హీరాలాల్ సమారియా రిటైర్ కావడంతో అప్పట్నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజ్గోయల్ను సీఐసీ పదవికి ఎంపికచేశారు. కొత్త కమిషనర్లు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించాక దాదాపు 9 ఏళ్ల తర్వాత కమిషన్ గరిష్ట సామర్థ్యంతో పనిచేయనుంది. బుధవారం 8 మందిని ఐసీలుగా సిఫార్సుచేయగా ఇప్పటికే ఆనందీ రామలింగం, వినోద్ కుమార్ తివారీలు ఐసీలుగా పనిచేస్తున్నారు.
సమాచార కమిషనర్(ఐసీ) పోస్ట్కు ప్రభుత్వం ఎంపికచేసిన 8 మందిలో సీనియర్ పాత్రికేయులు పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది, పెట్రోలియం, సహజవాయువు నియంత్రణ బోర్డ్లో లీగల్ సభ్యురాలైన రేలంగి సుధారాణి, మాజీ రైల్వేబోర్డ్ చీఫ్ జయవర్మ సిన్హా, మాజీ ఐపీఎస్ అధికారి స్వాగత్ దాస్, సెంట్రల్ సెక్రటేరియట్ సరీ్వస్ మాజీ అధికారి సంజీవ్ కుమార్ జిందాల్, మాజీ ఐఏఎస్ అధికారి సురేంద్ర సింగ్ మీనా, మాజీ ఇండియన్ ఫారెస్ట్ సరీ్వస్ అధికారి కుష్వంత్ సింగ్ సేథీ ఉన్నారు.


