
భోపాల్: మధ్యప్రదేశ్ భోపాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జంబోరి గ్రౌండ్లో మహిళా సాధికారత మహా సదస్సుకు హాజరయ్యారు. అక్కడ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
‘‘టెర్రరిజంపై సిందూర్ సక్సెస్ ఫుల్ ఆపరేషన్. పాకిస్తాన్ సైన్యం కూడా ఊహించని ప్రదేశాలలో మన దళాలు ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాయి. ఉగ్రవాదం ద్వారా పరోక్ష యుద్ధాలను ఇకపై సహించబోమని ఈ ఆపరేషన్ స్పష్టంగా చెప్పింది. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేవారు కూడా భారీ మూల్యం చెల్లించుకుంటారు’’ అని మోదీ హెచ్చరించారు.
పహల్గామ్ దాడి.. భారత సాంప్రదాయాలపై దాడి.. సిందూరం అనేది భారత సాంప్రదాయంలో ఒక భాగంగా మోదీ పేర్కొన్నారు. ‘‘పహల్గాంలో ఉగ్రవాదులు భారతీయుల రక్తాన్ని చిందించడమే కాకుండా, మన సంస్కృతిపై కూడా దాడి చేశారు. మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారు’’ అని మోదీ అన్నారు.
కాగా, లోకమాత దేవీ అహల్యాబాయి పోస్టల్ స్టాంపును, రూ.300 ప్రత్యేక నాణెం ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోర్ మెట్రో, దాతియా-సత్నా ఎయిర్ పోర్టును ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఉజ్జయినిలో 29 కిలోమీటర్ల పొడవైన ఘాట్కు కూడా ప్రధాని.. వర్చువల్ భూమిపూజ నిర్వహించారు.