ఈ బంధమేనాటిదో!

Orissa: Unique Friendship Of Man And Wild Boar - Sakshi

మల్కన్‌గిరి(భువనేశ్వర్‌): తన ఆనందం, అవసరాల కోసం సాధు జంతువులను మచ్చిక చేసుకోవడం వేల సంవత్సరాల క్రితమే మనిషి ప్రారంభించాడు. కొందరైతే అడవుల్లో ఉన్న వన్య ప్రాణులకు సైతం ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి, యజమానిలా వాటితో ఆదాయం పొందుతుంటారు. మరికొందరు రాక్షసానందం కోసం జీవాల ప్రాణాలు హరిస్తుంటారు. మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి చెందని మహేంద్ర మాత్రం పైవాటికి భిన్నం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వన్యప్రాణికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆలనాపాలన చూస్తున్నారు.

జీవం కూడా నిన్ను వదలి పోలేనంటూ గత 20 ఏళ్లుగా ఆయనను విడిచి పెట్టడం లేదు. వివరాల్లోకి వెళ్తే... 20 ఏళ్ల క్రితం వచ్చిన వరదలో మల్కన్‌గిరిలోని జగన్నాథ్‌ మందిరం సమీపంలో నివాసం ఉంటున్న మహేంద్ర ఇంటికి సమీప కాలువలో అడవిపంది పిల్ల కొట్టుకు వచ్చింది. చలికి గజగజా వణుకుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరాహాన్ని గమనించిన ఆయన.. ఇంటికి తీసుకు వచ్చి, ఆహారం అందించాడు. రక్షణ కల్పించి, అక్కడే ఆశ్రయం కల్పించాడు. 

అడవిలో వదిలి పెట్టినా.. 
వరాహం కొద్దిగా కోలుకున్న అనంతరం మహేంద్ర అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు ప్రయత్నించాడు. అయితే చిన్న పిల్ల కావడంతో అతనే వద్దే క్షేమంగా ఉంటుందని భావించిన సిబ్బంది.. తిరిగి అడవిలోకి పంపించేందుకు నిరాకరించారు. దీంతో అప్పటి నుంచి తన ఇంట్లో మనిషిలాగే వన్యప్రాణిని పెంచి, పెద్ద చేశాడు. దానికి రాజు అని పేరు కూడా పెట్టాడు. ఈ ఇద్దరి బంధం ఏనాటిదో గానీ మహేంద్ర ఎంత చెబితే అంతే అన్నట్లుగా వరాహం తయారైంది.

రెండు దఫాలు అడవిలో వదిలినా, తిరిగి మహేంద్ర ఇంటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో జీవిపై మరింత ప్రేమ పెంచుకొని, తనకు ఉన్న దాంట్లోనే రాజుని కూడా పోషిస్తున్నాడు. మనుషుల్లాగే అన్నం, బిస్కెట్లు, రొట్టె, చపాతీ తదితర పదార్థాలను ఆహారంగా అందిస్తున్నాడు. ఈ 20 ఏళ్లలో ఎవరికీ ఎలాంటి హానీ చెయ్యలేదని, వీధిలో పిల్లలు కూడా రాజుతో కాసేప గడిపేందుకు ఆసక్తి చూపుతారని మహేంద్ర చొప్పుకొచ్చారు. ఆహారం కోసం అడవికి వెళ్లినా.. సాయంత్రం తిరిగి వస్తుందని, రాత్రి సమయంలోనూ తనను విడిచి ఉండదని వన్యప్రాణి ప్రేమను ఆయన వివరించాడు.

చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top