పిల్లల కోసం ఎల్ఐసీ ప్రత్యేక పాలసీ

LIC New Children Money Back Plan Benefits - Sakshi

మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా మంచి పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా?, అయితే మీకు ఒక గుడ్ న్యూస్. మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది ఒక మనీ బ్యాక్ పాలసీ. అంటే పిల్లల చదువు, పెళ్లిళ్లు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీ అవసరాలు తగ్గట్టుగా డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టిన వెంటనే ఈ పాలసీ తీసుకోవచ్చు.

ఈ పాలసీలో చేరాలంటే పిల్లల వయస్సు 0 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి. పిల్లల తల్లిదండ్రులు లేదా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పిల్లల పేరుతో పాలసీ తీసుకోవచ్చు. పిల్లల మెచ్యూరిటీ వయస్సు 25 ఏళ్లు వచ్చేవరకు పాలసీ గడువు ఉంటుంది. పాలసీ వ్యవధి పిల్లల వయస్సుపై ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా 25 సంవత్సరాలు కాగా, కనీసం 13 సంవత్సరాలు. ఈ పాలసీకి కనీస మొత్తం 1 లక్ష రూపాయలు అయితే గరిష్టంగా పరిమితి ఏమిలేదు. వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక, నెలవారీ ప్రాతిపదికన ప్రీమియం చెల్లింపు చేయవచ్చు.

ఉదాహరణకు రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో 0 ఏళ్లు ఉన్న పిల్లలు అయితే ఏడాదికి రూ.4327 ప్రీమియం చెల్లించాలి. 5 ఏళ్లు ఉంటే రూ.5586 ప్రీమియం, 10 ఏళ్లు ఉంటే రూ.7899 ప్రీమియం, 12 ఏళ్లు ఉంటే రూ.9202 ప్రీమియం చెల్లించాలి. ఈ పాలసీ తీసుకున్న పిల్లల వయస్సు 18, 20, 22 ఏళ్లు చేరుకున్నప్పుడు 20 శాతం చొప్పున మనీ బ్యాక్ వస్తుంది. మీకు మొత్తం మూడు వాయిదాల్లో కలిపి 60 శాతం మనీ బ్యాక్ పొందవచ్చు. ఇక మిగిలిన 40 శాతం గడువు కాలం ముగిసిన తర్వాత బోనస్‌తో కలిపి వస్తుంది. డెత్ బెనిఫిట్ గురించి మాట్లాడితే, పాలసీ సమయంలో పిల్లవాడు చనిపోతే, తల్లిదండ్రులకు సమ్ అష్యూర్డ్, బోనస్ లభిస్తుంది. 

ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీకి ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకున్న తర్వాత నచ్చకపోతే 15 రోజుల్లో వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా లభిస్తుంది. ఇక ప్రీమియం పేమెంట్ ఆలస్యం అయితే 15 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. ఎల్ఐసీ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ తీసుకుంటే పాలసీ ప్రపోజర్ అంటే పిల్లల పేరుతో పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రీమియం చెల్లిస్తున్న కాలంలో మరణిస్తే ఆ తర్వాత చెల్లించాల్సిన ప్రీమియంలను మాఫీ చేస్తుంది. అంటే ప్రీమియంలు చెల్లించకపోయినా పిల్లల వయస్సు 25 ఏళ్ల వచ్చేవరకు పాలసీ కొనసాగుతుంది. మనీ బ్యాక్ కూడా వస్తుంది. ఈ పాలసీకి రైడర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత సరెండర్ చేయొచ్చు. సెక్షన్ 80సీ కింద టాక్స్ మినయింపు కూడా లభిస్తుంది.

చదవండి:

మళ్లీ తగ్గిన బంగారం ధర!

ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్​అలర్ట్!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top