బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనే నెపంతో ఓ భర్త తన భార్యకు ప్రసాదంలో విషం కలిపి ఇచ్చాడు. అనంతరం ఆమె స్ప్రహ కోల్పోవడంతో గొంతునులిమి చంపాడు. మహిళ మృతి పట్ల అనుమానం రావడంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం..
బెళగావి జిల్లా గోకాక్ కు చెందిన సంతోష్ పటాయత్కు, ధార్వాడ్ తాలూకా కల్లూరు గ్రామానికి చెందిన సక్కుబాయి పటాయత్తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. అయితే, గత నాలుగేళ్లుగా సంతోష్ తన గ్రామానికి చెందిన ఒక వితంతువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతోనే జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకుని, భార్యను వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు.
ప్రస్తుతం ‘అధిక మాసం’ నడుస్తుండటంతో, భార్య సక్కుబాయిని బైల్హోంగల్ తాలూకా మరకూంబి గ్రామంలోని చాముండేశ్వరి దేవాలయానికి తీసుకెళ్లాడు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో కూల్ డ్రింక్లో ఎలుకల మందు, గాజుల ముక్కల పొడిని కలిపి.. అది ‘దేవుడి ప్రసాదం’ అని నమ్మించి భార్యతో తాగించాడు. విషం ప్రభావంతో సక్కుబాయి స్పృహ కోల్పోతుండగా, సంతోష్ ఆమెను రోడ్డు పక్కన గొంతు పిసికి దారుణంగా హత్య చేశాడు.
రోడ్డుప్రమాదంగా డ్రామా
అనంతరం ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు ఒక డ్రామా ఆడాడు. భార్య మృతదేహంపై మోటార్ సైకిల్ను పడేసి, ప్రమాదం జరిగినట్లు కలరింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని గంటల పాటు అక్కడే ఉండి, తానే స్వయంగా పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చాడు. అయితే సక్కుబాయి మృతి చెందిన తీరుపై పోలీసులకు అనుమానం రావడంతో, మృతదేహాన్ని పోస్ట్మార్టం చేయగా నివేదికలో అది రోడ్డు ప్రమాదం కాదని హత్యేనని తేలింది.
దీంతో నిందితున్ని అరెస్టు చేశారు. కాగా ఈ హత్యలో సంతోష్ ప్రియురాలైన సదరు వితంతువు పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.


