
న్యూఢిల్లీ: ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. అమెరికాలో పర్యటించడమే కాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో డిన్నర్ మీట్లో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై ప్రజల్లో ఆసక్తికర చర్చ ఇంకా సాగుతూనే ఉంది. పాక్ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు వెళ్లకుండా ఒక ఆర్మీ చీఫ్ వెళ్లడం ఏంటనే ప్రశ్న చాలా మందిలో తలెత్తింది.
పాకిస్తాన్లో నియంత పాలన మనకు కొత్తేమీ కాదు. గతంలో పర్వేజ్ ముష్రాఫ్.. పాకిస్తాన్ పీఠాన్ని ఎలా అధిరోహించారో అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆ తరహా లక్షణాలున్న వ్యక్తి అసిమ్ మునీర్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు అత్యంత సన్నిహితుడైన అసిఫ్ మునీర్కు అత్యంత క్రూరుడు, నియంత అనే అపవాదు కూడా ఉంది.
మరి ఈ తరహా లక్షణాలుండటమే కాకుండా ఆర్మీ చీఫ్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని అగ్రరాజ్యం ఆహ్వానించడమే ప్రధానంగా చర్చ. అది కూడా భారత్తో జరిగిన యుద్ధం అనంతరం చోటు చేసుకున్న పరిణామం ఇది. అంటే ఇక్కడ పాకిస్తాన్కు అమెరికా ఏ తరహా సహకారం అందిస్తుందో అనేది క్లియర్గానే తెలిసిపోతుంది.
ఇదిలా ఉంచితే, ఈ అంశంపై భారత డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ పరోక్షంగా స్పందించారు. ‘ ప్రధాని కనిపించకుండా ఒక ఆర్మీ చీఫ్ దేశ అంతర్గత విషయాలు చర్చించడం నిజంగానే పాకిస్తాన్కు అత్యంత చిరాకు కల్గించే అంశమన్నారు. ‘ ఇది నా అభిప్రాయం కాకపోయినా, ఏ దేశమైనా ఇలానే అనుకుంటుంది. ప్రధానికి స్థానం లేకుండా ఆర్మీ చీఫ్కు ప్రత్యేక స్థానం ఇవ్వడం అనేది ఆశ్చర్యం కల్గిస్తుంది. ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది కూడా’ అని రాజేశ్ కుమార్ తెలిపారు.