భారత్‌కు ‘టారిఫ్‌’ షాక్‌.. మరో బాంబు పేల్చిన ట్రంప్‌ | Trump again threatens India | Sakshi
Sakshi News home page

భారత్‌కు ‘టారిఫ్‌’ షాక్‌.. మరో బాంబు పేల్చిన ట్రంప్‌

Aug 5 2025 6:23 PM | Updated on Aug 5 2025 7:14 PM

Trump again threatens India

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మరోసారి బెదిరింపులకు దిగారు. మరో  24 గంటల్లో భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. భారత్‌తో వ్యాపారం చేయడం కష్టంగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.  

సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ.. భారత్‌ మంచి వాణిజ్య భాగస్వామి కాదు. ఎందుకంటే వారు మాతో చాలా వ్యాపారం చేస్తారు. కానీ మేము వారితో వ్యాపారం చేయం. రష్యా నుంచి భారత్‌ చమురును కొనుగోలు చేస్తోంది. ఆ చమరు కొనుగోళ్లను ఆపకపోతే మరో 24 గంటల్లో టారిఫ్‌ను భారీ ఎత్తున పెంచబోతున్నాను’అని అన్నారు.  

భారత కాలమాన ప్రకారం.. సోమవారం (ఆగస్టు 4)ట్రంప్‌.. భారత్‌కు హెచ్చరికలు పంపించారు. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. 

భారత్‌కు ముడి చమురును విక్రయించడం ద్వారా వచ్చిన నగదు ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్‌ యుద్ధం కోసం మంచి నీళ్లలా ఖర్చు పెడుతోంది. దీంతో రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా ఒక యుద్ధ యంత్రంలా మారిపోయింది. భారత్‌కు ఇవేం పట్టవు. అందుకే భారత్‌పై మళ్లీ దిగుమతి సుంకాలను పెంచుతా’’అని ట్రంప్‌ ప్రకటించారు.

మరోమారు దిగుమతి టారిఫ్‌ల మోత మోగిస్తానన్న ట్రంప్‌ వ్యాఖ్యలపై మోదీ సర్కార్‌ తీవ్రంగా స్పందించింది. ఏ దేశం నుంచి ఏమేం కొనాలి, ఎంత కొనాలి అని నిర్ణయించుకునే స్వేచ్ఛ... సార్వభౌమత్వ దేశమైన భారత్‌కు ఉందని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ఉక్రెయిన్‌ యుద్ధానికీ భారత చమురు కొనుగోళ్లకు ఎలాంటి సంబంధం లేదు.

అయినా సరే ఉక్రెయిన్‌ సమరం మొదలయ్యాక రష్యా నుంచి మేం చమురును దిగుమతి చేసుకుంటుంటే అమెరికా, యురోపియన్‌ యూనియన్లు ఉద్దేశపూర్వకంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక భారత్‌కు విదేశాల నుంచి దిగుమతి కావాల్సిన ముడి చమురు సరఫరాలో ఆటంకాలు తలెత్తాయి. దీంతో చమురు తక్షణ అవసరాల కోసం రష్యా నుంచి దిగుమతులను పెంచుకున్నాం.

భారతీయ వినియోగదారుల ఇంధన అవసరాలు తీర్చేందుకు, అనువైన ధరలకు ఇంధనాలను అందించేందుకు రష్యాపై ఆధారపడాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అస్థిరత ఏర్పడిన సందర్భాల్లో దిగుమతి సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అయినా రష్యాతో మా వాణిజ్యంపై ఇష్టారీతిగా మాట్లాడే ఇవే దేశాలు రష్యాతో వాణిజ్యంచేస్తున్నాయికదా. స్వయంగా అమెరికా సైతం రష్యాపై ఆధారపడుతోంది.

అమెరికా తమ అణువిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల కోసం యురేనియం హెగ్జాఫ్లోరైడ్‌ను, విద్యుత్‌వాహనాలు, ఎరువుల పరిశ్రమల్లో వాడేందుకు పల్లాడియంను రష్యా నుంచి అమెరికా ఇప్పటికీ దిగుమతి చేసుకుంటోంది. 2024లో రష్యాతో యురోపియన్‌ యూనియన్‌ ఏకంగా 67.5 బిలియన్‌ యూరోల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి దేశాలు కేవ లం భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం సహేతుకం అనిపించుకోదు. ప్రపంచంలోని ప్రధానమైన ఆర్థికవ్యవస్థల్లో ఒకటైన భారత్‌ సైతం తన సొంత జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత కోసం స్వీయ నిర్ణయాలు గతంలో తీసుకుంది. ఇకమీదటా ఇదే ఒరవడి కొనసాగిస్తుంది’’అని భారత్‌ తెగేసి చెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement