‘మీరంతా స్వర్గానికే’.. వరద బాధితులతో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు | minister sanjay kumar nishad controversy comments on flood affected victims | Sakshi
Sakshi News home page

‘మీరంతా స్వర్గానికే’.. వరద బాధితులతో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Aug 5 2025 5:33 PM | Updated on Aug 5 2025 6:32 PM

minister sanjay kumar nishad controversy comments on flood affected victims

లక్నో: అనూహ్యంగా సంభవించే వరదల కారణంగా ప్రజలు సర్వస్వం కోల్పోతుంటారు. తాజాగా, అలా సర్వం కోల్పోయిన వరద బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.  

ఉత్తరప్రదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో మొత్తం 402 గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో కాన్పూర్ దెహాత్ జిల్లాలో వరద బాధితుల్ని మంత్రి సంజయ్ నిషాద్ పరామర్శించారు. ఓ ప్రాంతానికి వెళ్లిన ఆయనకు వరద బాధితులు తమ బాధల్ని చెప్పుకున్నారు. వరదల కారణంగా తాము కట్టు బట్టలతో సహా అన్నీ కోల్పోయామని వాపోయారు.

అయితే అందుకు మంత్రి సంజయ్ నిషాద్‌ స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. ‘గంగమ్మతల్లి తన బిడ్డల పాదాలు కడగడానికి వస్తుంది. ఆ దర్శనంతో వారు స్వర్గానికి వెళతారు. విపక్షాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని అన్నారు.

ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. వరద బాధితులు మంత్రి వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. సదరు మంత్రి వరద బాధితుల్ని పరామర్శించేందుకు ఏ ప్రాంతానికి వచ్చామనే సోయిలేకుండా పోయిందని మండిపడుతున్నారు. 

ఎందుకంటే ఆయన సందర్శించిన గ్రామాలు గంగా నది వద్ద కాకుండా యమునా నది ఒడ్డున ఉన్నాయని చెబుతూ విస్తుపోతున్నారు. కాగా రాష్ట్రంలో 402 గ్రామాలకు వరద ముంపుకు గురయ్యారు. గంగా, యమునా వంటి ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement