దేశీ మద్యం గుబాళింపులు | Indian alco-bev market is the third biggest in the world | Sakshi
Sakshi News home page

దేశీ మద్యం గుబాళింపులు

Mar 3 2025 5:51 AM | Updated on Mar 3 2025 5:51 AM

Indian alco-bev market is the third biggest in the world

బార్లలో దేశవాళీ రకాలకు పెరుగుతున్న డిమాండ్‌

ప్రపంచంలో విస్కీని అత్యధికంగా వాడేది భారత్‌లోనే. విశ్వవ్యాప్తంగా తయారయ్యే వీస్కీలో దాదాపు సగం మన దేశంలోనే ఖర్చయిపోతోంది. విస్కీ, రమ్, జిన్, ఓడ్కా, బ్రాండీ... ఇలా అన్ని రకాలూ కలిపి భారత్‌లో మద్యం మార్కెట్‌ విలువ ఏకంగా రూ.4.59 లక్షల కోట్లకు చేరింది.  మరో మూడేళ్లలో రూ.5.59 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 

ఇంతటి భారీ మార్కెట్‌లో దేశవాళీ మద్యం కూడా తన హవా కొనసాగిస్తోంది. విదేశీ మూలాలున్న విస్కీ, బ్రాండీ, ఓడ్కా లాంటి వాటితో పోలిస్తే స్థానిక  రకాలను ప్రేమించే మద్యం ప్రియులు ఎక్కువైపోయారు. వారి అభిరుచికి తగ్గట్లు స్థానిక రకాలకూ స్థానం కల్పించడం బార్లలో ఇప్పుడు పెద్ద ట్రెండ్‌గా మారింది. ఈ ధోరణి నానాటికీ పెరుగుతోందనేందుకు పెరిగిన దేశవాళీ సరకు అమ్మకాలే నిదర్శనం.

టోంగ్‌బా.. జుడియా 
సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లలో టోంగ్‌బా అనే స్థానిక మద్యం మద్యపాన ప్రియులకు మహా ఇష్టం. అస్సాంలో జుడియా, మణిపూర్‌లో సేక్‌మాయ్‌ యూ... ఇలా స్థానిక రుచులకు జనం నానాటికీ ఫిదా అవుతున్నారు. ఇక గోవాలో ఫెనీ చాలా ఫేమస్‌. ఈ స్థానిక మద్యాన్ని పులియబెట్టిన జీడిపప్పుల నుంచి తయారుచేస్తారు. 

గోవాలో ఏ మూలన చూసినా, ఏ బార్‌లో చూసినా విదేశీ మద్యంతో పాటు ఫెనీ కూడా అమ్ముతారు. పలు రాష్ట్రాల నుంచి వచి్చన పర్యాటకులతోపాటు విదేశీ సందర్శకులు కూడా దీన్ని టేస్ట్‌ చేయకుండా వదిలిపెట్టరు. అందుకే ఇప్పుడక్కడ దీని విక్రయాలు గతంలో పోలిస్తే బాగా పెరిగాయి. ‘‘పోర్చుగీస్‌ మూలాలున్న ఫెనీకి స్థానిక రుచిని కలపడంతో గోవా సంస్కృతిలో భాగంగా మారింది’’ అని మిస్టర్‌ బార్‌ట్రెండర్‌గా ఇన్‌స్టాలో ఫేమస్‌ అయిన కాక్‌టేల్‌ నిపుణుడు నితిన్‌ తివారీ చెప్పారు. 

దేశవ్యాప్తంగా మారిన టేస్ట్‌
శతాబ్దాల చరిత్ర ఉన్న స్థానిక మద్యం రకాలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. దాంతో అవి బార్లలోనూ అందుబాటులోకి వస్తున్నట్టు తులీహో సీఈఓ, 30బెస్ట్‌బార్స్‌ ఇండియా, ఇండియా బార్‌టెండర్‌ వీక్‌ సహ వ్యవస్థాపకుడు విక్రమ్‌ ఆచంట చెప్పారు. ఈ ట్రెండ్‌ గతేడాది నుంచి మొదలైందని నెట్‌ఫ్లిక్స్‌ మిడ్‌నైడ్‌ ఆసియా కన్సల్టెంట్, ప్రముఖ కాక్‌టేల్‌ నిపుణుడు అమీ ష్రాఫ్‌ వెల్లడించారు. ‘‘స్థానిక మద్యానికి జై కొట్టడానికి ప్రధాన కారణం సోషల్‌ మీడియాలో యువత చేస్తున్న ప్రచారమే. 

హిమాచల్‌లో ధాన్యం, గింజలను ఉడకబెట్టి తయారుచేసే రైస్‌ వైన్‌ వంటి స్థానిక రకాలకు ఇప్పుడిప్పుడే డిమాండ్‌ పెరుగుతోంది’’ అని పీసీఓ, ఢిల్లీ జనరల్‌ మేనేజర్‌ వికాస్‌ కుమార్‌ చెప్పారు. ‘‘ఇదేదో గాలివాటం మార్పు కాదు. పక్కాగా వ్యవస్థీకృతంగా జరుగుతోంది. దేశవాళీ మద్యానికి గుర్తింపు తేవాలని ఇక్కడి కంపెనీలు నడుం బిగించాయి’’ అని డియాజియో ఇండియా చీఫ్‌ ఇన్నోవేటివ్‌ ఆఫీసర్‌ విక్రమ్‌ దామోదరన్‌ అన్నారు. 

విలాస వస్తువుగా..
‘‘ఇండియా అగావే, ఫెనీ, మహువా వంటి స్థానిక మద్యం ఆయా ప్రాంతాల్లో మాత్రమే లభిస్తోంది. ఆ రకం కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. అయినా సరే, రానుపోను ఖర్చులు, బస, ఇతరత్రా ఖర్చులను కూడా లెక్కచేయకుండా ప్రత్యేకంగా అక్కడిదాకా వెళ్లి మద్యం సేవించి రావడం ట్రెండ్‌గా మారింది. దీంతో స్థానికేతరులకు స్థానిక మద్యం కూడా విలాస వస్తువుగా మారుతోంది’’ అని మాయా పిస్టోలా అగావెపురా మద్యం సంస్థ మహిళా సీఈఓ కింబర్లీ పెరీరా చెప్పారు. ‘మహువా రకం మద్యం బ్రిటన్‌కు భారత్‌ వలసరాజ్యంగా మారకముందు చాలా ఫేమస్‌. తర్వాత మరుగున పడింది.

 ఇప్పుడు కొందరు దాంట్లో పలు రుచులు తెస్తున్నారు. వాటిని కాక్‌టేల్‌ నిపుణులు మరింత మెరుగుపరుస్తున్నారు. సిక్స్‌ బ్రదర్స్‌ మహువా పేరుతో దేశంలోనే తొలిసారిగా లగ్జరీ మహువా మద్యం తెస్తున్నాం’’ అని సౌత్‌ సీస్‌ డిస్టిలరీస్‌ డైరెక్టర్‌ రూపీ చినోయ్‌ చెప్పారు. అయితే, ‘‘స్థానిక మద్యం మొత్తానికీ వర్తించే సింగిల్‌ బ్రాండ్‌ అంటూ ఇప్పటికైతే ఏమీ లేదు. ఈ సమస్య పరిష్కారమైతే లైసెన్సింగ్‌ సమస్యలు తీరతాయి. అప్పుడు దేశవాళీ మద్యం అమ్మకాలు, నాణ్యత పెరుగుతాయి’’ అని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement