వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్లకు, వాటి వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఊరట కల్పించింది. భద్రతా కారణాలతో తప్పనిసరి చేసిన సిమ్ బైండింగ్ నిబంధన అమలు గడువును ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టెక్ కంపెనీలు ఎదుర్కొంటున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఒక యాప్ పనిచేయాలంటే అది ఇన్స్టాల్ అయిన ఫోన్లోని సిమ్ కార్డుతో తప్పనిసరిగా అనుసంధానం కావడాన్నే సిమ్ బైండింగ్ అంటారు. గత ఏడాది నవంబర్లో కేంద్రం ఈ నిబంధనను తీసుకొచ్చి 90 రోజుల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఐతే దీన్ని అమలు చేయడంలో టెస్టింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ వంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమకు మరింత సమయం కావాలని టెక్ కంపెనీలు కేంద్రాన్ని కోరాయి.
కంపెనీల అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించిన కేంద్రం, గడువును డిసెంబర్ వరకు పొడిగించేందుకు సిద్ధమైనట్లు టెలికాం శాఖ ఉన్నతాధికారులను అడ్రెస్ చేస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ గడువు పొడిగింపుతో సిమ్ బైండింగ్ నిబంధనలను పక్కాగా అమలు చేయడానికి టెక్ కంపెనీలకు తగినంత సమయం లభిస్తుంది. అదే సమయంలో కోట్లాది మంది యూజర్లకు తక్షణమే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉంటుంది.


